
1998 మార్చి 29న బెంగళూరులో జన్మించిన అదితి అశోక్ ఐదేళ్ల వయసులోనే గోల్ఫ్ ఆడడం ప్రారంభించింది. 18 ఏళ్ల వయసులో 2016 రియో ఒలింపిక్స్ లో పాల్గొంది. టోక్యో ఒలింపిక్స్లో 200 ర్యాంకర్గా బరిలోకి దిగి,.. నెంబర్ వన్ ఆటగాళ్లకు కూడా చుక్కలు చూపించింది. దీంతో అదితి అద్భుత ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ దక్కుతుంది.

టోక్యో ఒలింపిక్స్ లో అదితి అశోక్ తనదైన ముద్ర వేసి.. నాలుగో స్థానంలో నిలిచిన భారత తొలి మహిళా గోల్ఫర్ గా చరిత్ర సృష్టించింది. అదితి అశోక్ ప్రదర్శనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందిస్తూ.. ఈ రోజు నీ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత గోల్ఫింగ్ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లావు. అద్భుతమైన నైపుణ్యంతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన అదితికి అభినందనలు చెప్పారు.

ప్రధాని మోడీ స్పందిస్తూ.. టోక్యో ఒలింపిక్స్లో బాగా ఆడావు అదితి. పతకం తృటిలో మిస్ అయ్యి ఉండొచ్చు కానీ ఈ ఆటలో ఇప్పటి వరకూ ఏ భారతీయుడు చేరుకోలేనంత దూరం వెళ్లావు. ఆ దారిలో మెరిశావు. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని ప్రధాని మోడీ కోరుకున్నారు.

గోల్ఫ్ లో పతకం కోసం చివరి వరకూ ఎంతో గొప్పగా అడావు.. చరిత్ర సృష్టించావు.. గోల్ఫ్లో భారత్ను సరికొత్త శిఖరాలను చేర్చావంటూ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనియాడారు

అదితి అశోక్.. నువ్వు తృటిలో పతకం కోల్పోయినప్పటికీ టోక్యోలో నాలుగో స్థానంలో నిలిచావు. నీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం. నీ భవిష్యత్ మరింత అందంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గోల్ఫ్ పై ద్రుష్టి పెట్టేలా నీ ఆట కొనసాగిందని.. మా పై ఒత్తిడి పెంచిన నీకు కృతఙ్ఞతలని చెప్పారు.