తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా డీఎస్సీ పరీక్ష వాయిదాపై నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో భారీగా పోస్టులతో కొత్తగా మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
నిరుద్యోగులు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న ప్రస్తుత డీఎస్సీ పరీక్షలకి బాగా సిద్ధమై పరీక్షలు రాయాలని సూచించారు. ప్రస్తుతం 11,062 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుందని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న పరీక్షలు ఇప్పటి వరకు 2.05 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుత నోటిఫికేషన్ పూర్తైనా.. మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలింది. ఈ ఐదువేలతోపాటు భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తమ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్లు ఖాళీలను బట్టి ఎప్పటికప్పుడు జారీచేస్తూనే ఉంటుందని అయన అన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2, డీఎస్సీకి సంబంధించి ఒక్కపోస్టు కూడా భర్తీ చేయలేదని భట్టీ అన్నారు. అప్పట్లో సీఎల్పీ నేతగా నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో డిమాండ్ చేశాం. చివరికి నోటిఫికేషన్లు ఇచ్చి.. పరీక్షలు నిర్వహిస్తే, పేపర్ లీకులయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించాం. గత సర్కార్ గ్రూప్-2 పరీక్షను 3 సార్లు వాయిదా వేస్తే.. మా ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. గ్రూప్ 3 పరీక్షలు వచ్చే నవంబర్లో జరుగుతాయి. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే మా ప్రభుత్వం ఆశని భట్టి చెప్పారు.