
నిర్మల్, సెప్టెంబర్ 17: వాళ్లంతా రైతన్నలు.. దుక్కులు దున్ని.. విత్తనాలు విత్తి.. కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటూ దేశానికి ఆకలి లోటు లేకుండా చూస్తారు. విశ్రాంతి ఎరగకుండా అలసటను లెక్క చేయకుంటా అహర్నిశలు సేద్యం కోసం శ్రమించడం మాత్రమే తెలిసిన వ్యక్తులు.

అలాంటి రైతన్నలు పొలాలకు కాసేపు విశ్రాంతి ఇచ్చి హలం పట్టిన చేతులతోనే బ్యాట్ చేతబడితే.. దుక్కులు దున్నిన చేతులతో సిక్స్ లు కొడితే.. పలుగు పారను పక్కనెట్టి పోర్లతో విరుచుకుపడితే.. పంచెలు పైకెత్తి మాస్ ఆట ఆడితే... ఆ జోష్ ఓ రేంజ్ లో ఉంటది. అలాంటి అద్బుతమైన దృశ్యం నిర్మల్ జిల్లా బైంసాలోని రైతన్నల క్రికెట్ మ్యాచ్ లో కనిపించింది. అచ్చు లగాన్ సినిమాను తలపించేలా సాగి మ్యాచ్ ఆద్యాంతం ఆకట్టుకుంది.

నిర్మల్ జిల్లా భైంసా మండలం కత్గాం గ్రామంలో రైతుల క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో బైంసా మండల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాగులోనే కాదు మైదానంలోను తమకు ఎవరు సాటి లేరు అని బ్యాట్ తో దుమ్ముదులిపి బంతులతో రప్పాడించి క్రికెట్ ఆడి ఆశ్వర్యపరిచారు.

నిత్యం వ్యవసాయ పనుల్లో బిజీ గా ఉండే రైతన్నలు ఆడిన క్రికెట్ పోటీలు స్థానికులను అలరించాయి. బాల్ బ్యాట్ తో రైతన్నలు రప్పాడిస్తుంటే.. ఆడియన్స్ కేరింతలతో మైదానం మారుమ్రోగింది.

వయసుతో సంబంధం లేకుండా.. రైతులు మైదానంలో చురుగ్గా పరుగులు తీస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో అన్ని విభాగాల్లో రాణించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రైతుల క్రికెట్ చూసేందుకు వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బౌలర్ , బ్యాటింగ్ , ఫీల్డింగ్ విభాగాల్లో ఉత్తమ ఆటను కనబరిచిన రైతులను బహుమతులతో సత్కరించి గౌరవించారు నిర్వహకులు.