
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇది 13వ ప్రపంచ కప్ ఎడిషన్ కాగా ఈ వరల్డ్ కప్ మన దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగో సారి. మొత్తం ఐదు వారాల పాటు సాగే ఈ టోర్నీలో భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో 31 మ్యాచ్లు జరుగుతాయి. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి ఏ స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయో ఇప్పుడు చూద్దాం..

డివై పాటిల్ స్టేడియం, నవీ ముంబై.. ఈ టోర్నమెంట్ కోసం DY పాటిల్ స్టేడియాన్ని ఎంపిక చేశారు. దీన్ని 2008లో ప్రారంభించారు. 45,300 మంది కూర్చునే సామర్థ్యంతో ఈ స్టేడియం భారతదేశంలో తొమ్మిదవ అతిపెద్ద స్టేడియంగా ఉంది. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు కూడా నిర్వహించారు. 2022లో తొలిసారిగా మహిళల అంతర్జాతీయ క్రికెట్ అక్కడ జరిగింది. ఆ సమయంలో భారత్, ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ ఆడింది. అలాగే భారత్, ఇంగ్లాండ్ మధ్య మహిళల టెస్ట్ మ్యాచ్ కూడా ఈ మైదానంలో జరిగింది. ఈ గ్రౌండ్ ఐసిసి ఉమెన్స్ ప్రపంచ కప్ 2025లో ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడే ఒక సెమీ-ఫైనల్స్, బహుశా ఫైనల్ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది.

అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతి.. అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 46,000 సామర్థ్యంతో ICC మహిళల ప్రపంచ కప్ 2025లో ఉపయోగించబడుతున్న అతిపెద్ద మైదానం. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఉన్న ఈ వేదిక 2012లో ప్రారంభమైంది. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగాయి. ఈ మైదానంలో ఎనిమిది అంతర్జాతీయ సెంచరీలు నమోదయ్యాయి, వాటిలో రెండు విరాట్ కోహ్లీ సాధించాడు. ఈ సంవత్సరం ప్రపంచ కప్లో అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

ACA-VDCA క్రికెట్ స్టేడియం, వైజాగ్.. ACA-VDCA క్రికెట్ స్టేడియం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కు రెండవ నిలయం, 27,500 మంది ప్రేక్షకులను కలిగి ఉంటుంది. విశాఖపట్నం మైదానం 2003లో ప్రారంభమైంది. స్పిన్నర్లకు సహాయపడే పిచ్ను కలిగి ఉంది. ఈ వేదిక భారత పురుషుల జట్టుకు క్రికెట్ మూడు ఫార్మాట్లకు ఆతిథ్యం ఇచ్చింది. 2005లో MS ధోని తన తొలి వన్డే సెంచరీ ఇదే గ్రౌండ్లో సాధించాడు.

హోల్కర్ స్టేడియం, ఇండోర్.. 30,000 మంది సామర్థ్యం గల ఈ వేదిక గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ తరపున IPL మ్యాచ్లను నిర్వహించింది. హోల్కర్ రాజవంశాన్ని గౌరవించటానికి యజమానులు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ 2010లో దీనిని ప్రస్తుత పేరుగా మార్చారు. 2006లో భారత పురుషులు ఇంగ్లాండ్తో ఒక వన్డే మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చారు. ఈ మైదానం 2025 ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది, ఇందులో ఇంగ్లాండ్తో భారతదేశం తలపడుతుంది.

ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో .. ఈ సంవత్సరం ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో మ్యాచ్లను నిర్వహించడానికి భారత్లో కాకుండా శ్రీలంకలోని కొలంబో ఆర్.ప్రేమదాస స్టేడియం కూడా వేదిక కానుంది. 35,000 మంది సామర్థ్యంతో ఉంది ఈ స్టేడియం. 1986లో ప్రారంభమైన ఈ మైదానంలో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. 1996, 2011లో ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్లను, 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ను, 2012లో ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్లు కూడా ఇక్కడ జరిగాయి.