
మంగళప్రదమైన పసుపు కొమ్ముల మాలలు, సుగంధ భరిత దివ్య పుష్ప హారాల ధారణతో జగన్మాత దివ్య మంగళ స్వరూపిణిగా సాక్షాత్కరించగా... ఆ లలిత సుందర రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వంతో మైమరచిపోయారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు గావించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. సర్వాలంకార భాషితమైన జగజ్జననిని దర్శించుకునేందుకు ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తజనం, ముఖ్యంగా మహిళామణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

ఆలయ ప్రాంగణమంతా నిరంతర దేవీ నామస్మరణలతో మారుమోగింది. క్షేత్రానికి విచ్చేసిన భక్త కోటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిధాం నిర్వాహకులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దివ్య దర్శనం అనంతరం భక్తులు తీర్ధప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. 'వారాహీ గుప్త నవరాత్రులు' విశేషలు మీకు తెలుసా ..ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ శక్తివంతమైన 'వారాహీ గుప్త నవరాత్రులు' అత్యంత నియమనిష్టలతో జరుగుతాయి.

లలితా పరాభట్టారిక దేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా, దండిని దేవిగా, అష్టమాతృకలలో ఒకరిగా వెలుగుందుతున్న వారాహీ అమ్మవారి ప్రాశస్త్యం ఆషాఢంలో మరీ విశేషమైనది. శారదీయ దసరా నవరాత్రుల్లా ఆడంబరంగా కాకుండా, ఆషాఢ నవరాత్రులను 'గుప్త నవరాత్రులు'గా వ్యవహరిస్తారు. ఈ కాలంలో చేసే పూజ, జపం లేదా ఆధ్యాత్మిక సాధనను నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఆచరిస్తే అనంతమైన సుఫలితాలు దక్కుతాయని వేదపండితులు పేర్కొంటున్నారు. వరాహ ముఖంతో, అభయ వరద హస్తాలతో, హల (నాగలి), ముసల (రోకలి) ధరించి దర్శనమిచ్చే ఈ తల్లి, భక్తుల అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు ఉగ్ర, ప్రసన్న స్వరూపిణిగా వెలిసింది.

రక్షణ దేవతగా, శత్రు వినాశకారిణిగా పూజలందుకునే ఈ అమ్మవారిని ధ్యానిస్తే కోర్టు కేసులు, దిష్టి దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల జయాలు, ధైర్యం సిద్ధసిస్తాయని నమ్మకం. ఈ ఆషాఢ మాసంలో భక్తులు తమ గృహాలలోనే అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లోని పూజా మందిరంలో దేవి పటాన్ని ఉత్తర లేదా తూర్పు ముఖంగా ఉంచి, ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి.

ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదా పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయడం అమ్మవారికి అత్యంత ప్రీతికరం. భూమికి, ధాన్యానికి అధిదేవత అయినందున చిలకడదుంపలు, చామదుంపలు వంటి ఉడకబెట్టిన దుంపలు, శనగలు, పెసలు, బెల్లం పొంగలి, పెరుగు అన్నం, దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించాలి. సంధ్యా సమయంలో సాత్వికాహార నియమాలు పాటిస్తూ, "ఓం ఐం శ్రీం క్రీం ఐం వారాహ్యై నమః" లేదా అష్టోత్తర శతనామావళిని ఏకాగ్రతతో జపించడం వల్ల అమ్మవారి కృపాకటాక్షాలు లభిస్తాయి.