కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభంకాగా వాహనం ముందు గజరాజులు నడవగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టి సాగింది.
స్వామివారిని కీర్తిస్తూ మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ముందుగా లక్ష్మీకాసుల మాలను టిటిడి ఈవో ధర్మారెడ్డి దంపతులు శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా వాహనమండపం వద్దకు తీసుకొచ్చి శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరించారు. మాడవీధులు నిండిన తరువాత నాలుగు కార్నర్లలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఇన్నర్ రింగ్ రోడ్ లో వేచి ఉన్న భక్తులకు గరుడ వాహన దర్శనభాగ్యం కల్పించారు.
దీంతో ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకో గలిగారు. గరుడ వాహనంపై స్వామి దర్శనం సర్వపాప ప్రాయశ్చిత్తంగా పరితపించే భక్తులు దాదాపు రెండు లక్షల మంది వరకు వాహన సేవలో పాల్గొన్నారు.
108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని భావించే భక్తులు గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారని విశ్వసిస్తారు.
గరుడ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అరుదైన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 21 కళాబృందాల్లో 497 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.
ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు శ్రీనివాస కళ్యాణాన్ని చక్కగా ప్రదర్శించారు. ఇందులో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి, స్వామివారి భక్తులైన శ్రీ గరుత్మంతుడు, శ్రీ తాళ్లపాక అన్నమయ్య తదితర వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు.
బెంగళూరు, విద్యారణ్యపురి నృత్యోదయ అకాడమీకి చెందిన దివ్యశ్రీ బృందం ఉత్సవసంకీర్తనల నాట్యవిన్యాసం భక్తులను సమ్మోహితులను చేసింది. మణిపూర్ కు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన తోగల్ జోగల్ కళలో భాగవత లీలలను తెలిపే మధురమైన ఘట్టాలను మనోహరంగా ప్రదర్శించారు.
కేరళ కు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన ఓనంను ఆటపాటలతో అలరించారు. మరో కేరళకు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన కథాకళిని చంద్రశేఖర్ బృందం అత్యంత రమణీయంగా ప్రదర్శించారు.
ఒరిస్సాకు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన సంబల్ పురి అనే కళారూపాన్ని ప్రతిభా రాణి బృందం సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు.
తమిళనాడు కు చెందిన నెమలిపించాలతో కూడిన భరతనాట్యం నయన మనోహరంగా ప్రదర్శించారు. మధ్యప్రదేశ్ కు చెందిన బండి గుడుంభజ అనే వాద్యకళను లోక్పాల్ దూవే ఆధ్వర్యంలో కడు విన్యాసాలతోప్రదర్శించారు.
గుజరాత్ లోని సుప్రసిద్ధ జానపద కళారూపమైన గూమర్ ను పి.రాజి బృందం చక్కగా ప్రదర్శించి భక్తులను అలరించారు.
అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని కూడా భక్తకోటికి తెలియజెబు తున్నాడని భక్తుల నమ్మకం. గరుడ వాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తోపాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.