
తొమ్మిది నెలలు జలవాసం.. నాలుగు నెలలు జనవాసం.. ఆ పరమశివుడు నీటి అడుగున చేసే తపస్సు ముగిసింది. కృష్ణా నది జల గర్భం నుంచి ఆ మహా శివాలయం మళ్లీ బయటపడింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం.. సప్త నదుల సంగమేశ్వరా లయం 9 నెలల నిరీక్షణ తర్వాత భక్తులకు కను విందు చేస్తోంది. ఆ లయకారుని మహిమకు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే సంగమేశ్వర క్షేత్రం.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణాజలాల నుంచి పూర్తిగా బయటపడింది. ఆలయ ప్రాంగణంలోని ఉన్న బురదను తొలగించిన శుభ్రం చేసిన తర్వాత ,భీముడు ప్రతిష్టించిన వేప దారు శివలింగానికి ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ సోమవారం తొలి పూజలు చేసే అవకాశం ఉంది

గత ఏడాది జున్15వ తేదీన కృష్ణ జలాల్లో సప్త నదుల సంగమేశ్వరా లయం పూర్తిగా మునిగిపోయింది. సంవత్సరం మళ్ళీ 9నెలల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. సోమవారం నుంచి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ అన్నారు.

నేటి నుండి 3 నెలలు లేదా 4 నెలల పాటు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు సంగమేశ్వరుడు ఆలయం ప్రతి సంవత్సరం 8 నెలలు కృష్ణ జలాలలో పూర్తిగా మునిగిపోయి నాలుగు నెలలు మాత్రం బయటపడి భక్తులకు దర్శనం ఇస్తుంది. 8 నెలల పాటు పూర్తిగా నీటిలో మునిగి ఉన్న వేప దారు శివలింగం కాని ఆలయం కాని ఎటువంటి చెక్కు చెదరక పోవడం స్వామివారి మహిమగా భక్తులు చెబుతుంటారు. ఇదే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా ఏడు నదులు ఒకే ప్రాంతంలో కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సప్త నదుల సంగమేశ్వరం అని అంటారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సమీపంలోని కృష్ణా నది తీరాన ఉన్న ఈ ప్రాంతంలో కృష్ణ , వేణి, తుంగ,భద్ర, బీమా, మలాపహారిని, భవనాసి. ఇలా ఏడు నదులు కలిసే అద్భుతమైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ ఆలయం 8 నెలలు పూర్తిగా కృష్ణ నదిలో మునిగిపోయి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది.