
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక ఉత్సవాలు వైభవంగా ముగిసాయి. చివరిరోజున మావుళ్ళమ్మకు మహా కుంభం నివేదించారు.

కాజా, జాంగ్రీ , మైసూర్ పాక్, బాదుషా, లడ్డూ, ఇలా వంద రకాల స్వీట్స్, బూరెలు , గారెలు, అరిసెలు వంటి పిండి వంటలు, పండ్లతో మహా నైవేద్యం ఏర్పాటు చేసారు ఉత్సవ కమిటీ. ఈ మహా నైవేద్యంంలో ముప్పై ఐదు కేజీల నేతితో చేయించిన లడ్డూ ను అమ్మవారికి సమర్పించారు.

మావుళ్ళమ్మ అమ్మవారికి అన్నపూర్ణా దేవి అలంకరణ చేసారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మావుళ్ళమ్మకు ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మహా కుంభంకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సమర్పించారు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు.

మావుళ్ళమ్మ మహా నైవేద్యంలో ఏర్పాటు చేసిన లడ్డూ పాట నిర్వహించారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు. భీమవరంకు చెందిన పడమట రామకృష్ణ లక్షా పదివేలుకు అమ్మవారి లడ్డూ పాడుకున్నాడు. ఉత్సవాల్లో మావుళ్ళమ్మకు మహా నైవేద్యం లో ఏర్పాటు చేసిన లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు రామకృష్ణ.

ప్రతి సంవత్సరం ఉత్సవాల్లో చివరిరోజున భారీగా అన్నదానం చేస్తారు. ఈ సంవత్సరం లక్ష మందికి అన్న దానం ఏర్పాటు చేసారు. ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ నిర్విరామంగా అన్నదానం జరింగింది.