
హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అలా దేవతలను ఉరేగించాహడానికి స్పెషల్ గా ఉత్సవ విగ్రహాలుంటాయి.అంతేకాదు. దేవతలను ఊరేగించే సమయంలో ఒకే రథాన్ని కూడా ఉపయోగిస్తారు.. అయితే ఈ సంప్రాదయాలకు భిన్నం ఓడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం. ఇక్కడ కొలువైన బలభద్ర, సుభద్రల సహా జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు వస్తారు.. భక్తులను తమ నిజరూపదర్శనం తో కనువిందు చేస్తారు. అంతేకాదు ఈ అన్నా చెల్లెలను ఊరేగించేందుకు ప్రతి ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో రథ యాత్రకు హాజరయ్యేవారు.

ఆషాఢ శుక్ల విదియ నాడు అంటే ఇవాళ.. వేద పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా) అంటూ నినాదాలు చేస్తూ ఉత్సవమూర్తులను కదిలించడంతో రథయాత్రా పర్వం మొదలైంది. 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది. అనంతరం సుభద్ర , బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేర్చటంలో యాత్ర ముగుస్తుంది.

ఉత్సవమూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేశారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అంటారు. ఉత్సవ మూర్తులు ఊరేగడానికి రథంపై సిద్ధంగా ఉండగా.. 'ఇలపై నడిచే విష్ణువు' గా గౌరవాభిమానాలను అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన పరమాత్ముడి ముందు సేవకుడిగా మారి బంగారు చీపురుతో రథాలను ఊడ్చాడు. దీన్నే ‘చెరా పహారా’ అంటారు.

ఈ పూరి జగన్నాథుడి రథ యాత్ర 12 రోజులు పాటు జరిగే ఉత్సవం .ఈ యాత్రకి రెండు నెలలముందు నించే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తిస్తాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహిస్తారు. అనంతరం ఆ చెట్లను జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి భక్తులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ , ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీర్వాదంతో దేశ ప్రజలు ఆనందంతో, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు

కరోనా కారణంగా జగన్నాథుని రథయాత్రను ఒడిశా ప్రభుత్వం ఈ ఏడాది పూరీకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. గతేడాది మాదిరిగానే భక్తులు లేకుండా రథయాత్ర చేపట్టారు. రథయాత్ర నేపథ్యంలో పూరీలోని అన్ని దారులను మూసివేసి, రాకపోకలను నిలిపి వేశారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు పూరీలో కర్ఫ్యూ విధించారు. పూరీలోకి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించినట్టు పోలీసులు తెలిపారు.