
శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత దీపావళి రోజున తన స్వస్థలమైన అయోధ్యకు తిరిగి వచ్చాడు. పురాణాల ప్రకారం, అయోధ్య మొత్తం ఆ రోజు దీపాల కాంతితో ప్రకాశిస్తుంది. అప్పటి నుంచి దీపావళిని వెలుగుల పండుగగా భావిస్తారు. భారతదేశంలోని ప్రజలు దీపావళిని తమదైన రీతిలో జరుపుకుంటారు.భారతదేశంలో దీపావళి వేడుకలు భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ దీపావళి జరుపుకునే సంప్రదాయం, సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోజు ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

వారణాసిలో దీపావళి: భారతదేశంలోని హిందువుల ప్రముఖ పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో దీపావళి చాలా అద్భుతమైన పండగ. దీపావళి సందర్భంగా ఈ ప్రదేశం దీపాలు, విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంటుంది. పవిత్ర గంగా నదిలో స్నానం చేసిన తర్వాత సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకోవడం, స్థానిక స్వీట్లను రుచి చూడడం ఆ అనుభూతి వేరు. ఎక్కువ కాలం ఇక్కడ ఉండే వారు దీపావళి తర్వాత కూడా అనేక ఇతర కార్యక్రమాల్లో భాగం కావచ్చు.

మైసూర్ లో దీపావళి: సాధారణంగా మైసూరులో ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడి జరిగే దసరా ఉత్సవాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే ఇక్కడ దీపావళి వేడుక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన మైసూర్ ప్యాలెస్ దీపావళి సందర్భంగా అందమైన లైట్లతో అలంకరించబడుతుంది. ఈ దృశ్యం హృదయాన్ని హత్తుకుంటుంది.

అమృత్సర లో దీపావళి: గోల్డెన్ టెంపుల్ ఓ అద్భుతం అంటే.. ఇక దీపావళి రోజున పసిడి కాంతులతో నిండి ఉండే దీపాల వెలుగులో గోల్డెన్ టెంపుల్ కనిపించే దృశ్యం అద్భుతం. ఆరవ గురు హరగోవింద్ జైలు నుండి విడుదలైన తర్వాత తమ సంతోషాన్ని తెలియజేస్తూ సిక్కు మతస్థులు దీపావళి పండగను జరుపుకున్నారని నమ్మకం. అతను 1629 లో జైలు నుండి విడుదలయ్యాడని నమ్ముతారు. ఇక్కడ దీపావళి ప్రత్యేకత ఎందుకంటే 1577లో గోల్డెన్ టెంపుల్ పునాది రాయి వేయబడింది.

కోల్కతాలో దీపావళి: నవరాత్రితో బెంగాల్లో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దుర్గాపూజ ఎక్కువ జరుపుకుంటారు.. అయితే వాస్తవానికి దీపావళి వేడుక కూడా చాలా బాగుంది. దీపావళిని కోల్కతాలో కాళీ దేవిని ఆరాధించి వేడుకగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇక్కడ ఉన్న కాళీమాత ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

గోవాలో దీపావళి: భారతదేశంలో గొప్ప పర్యాటక ప్రాంతం గోవా. ఇక్కడ బీచ్ లో ఎంజాయ్ చేయడానికి చల్లని వాతావరణాన్ని ఇష్టపడతారు. అయితే ఈ రాష్ట్రంలోని దీపావళి వేడుకలు కూడా ప్రత్యేకమైనవి. ఈ రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు చెబుతారు. దీనిని పురస్కరించుకుని, ఒక పోటీని నిర్వహిస్తారు. దీపావళికి ఒక రోజు ముందునరక చతుర్థి నాడు నరకాసురుని దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తారు.