
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు.

పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.

స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

శ్రీ మలయప్పస్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణ, జార్కండ్ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ రవి రంజన్, ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీ నంద కుమార్, శ్రీ రామేశ్వరరావు, శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ మారుతి ప్రసాద్, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జెఈవోలు శ్రీమతి సదాభార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్, తదితరులు పాల్గొన్నారు.