
కావలసిన పదార్థాలు: 1 గ్లాసు బాస్మతి రైస్ లేదా సోనా మసూరి బియ్యం, పావు కిలో టమాటాలు, సగం - తరిగిన ఉల్లిపాయ, 4 - చీలికల పచ్చిమిర్చి, 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టీస్పూన్ జీలకర్ర, పసుపు, కరివేపాకు, నెయ్యి, నూనె, రుచికి సరిపడా ఉప్పు మరియు నీళ్లు.

తయారీ విధానం: ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి, 4-5 టమాటాలను వేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మీడియం మంటపై 5 నిమిషాలు ఉడికించాలి. టమాటా తొక్క ఊడి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, చల్లారాక తొక్క తీసేసి టమాటాలను మిక్సీలో ఫైన్ ప్యూరీలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ మీద కడాయి లేదా గిన్నె పెట్టి, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేయాలి. ఇందులో జీలకర్ర, హోల్ గరం మసాలా దినుసులు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి.

ఉల్లిపాయలు వేగాక ఒక టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఆ తర్వాత మరో 3 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి మగ్గించాలి. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఎసరు కోసం నీళ్లు పోయాలి. ముందే ప్యూరీ వేసాం కాబట్టి, మామూలుగా వేసే నీళ్లకంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి.

బాస్మతి రైస్కైతే ఒకటికి 1¾ గ్లాసు నీళ్లు సరిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఎసరును మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపాలి. మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. నీరంతా ఇంకిపోయి అన్నం బిగుసుకుంటున్న సమయంలో పైన ఒక టీస్పూన్ నెయ్యి వేసి మూతపెట్టి, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు దమ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత మూత తీస్తే, ఇల్లంతా ఘుమఘుమలాడే ప్యూర్ టమాటో పులావ్ సర్వ్ చేసుకోవడానికి సిద్ధం!