
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. అర్హులైన ప్రతీఒక్క కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఒకవేళ అర్హత ఉన్నా రేషన్ కార్డు అందకపోతే కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్రంలోని ప్రజలందరికీ సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు. అర్హత ఉండి లబ్ది పొందకుండా ఎవరూ ఉండకూడదని తెలిపారు.

ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వంలో పేదలెవ్వరూ ఇబ్బంది పడకూడదని, ఏ ఒక్కరూ ఆహార భద్రతకు దూరం కాకూడదని అన్నారు. రేషన్ కార్డుకు అర్హత ఉండి ఇప్పటివరకు పొందనివారు తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పేదలందరికీ రేషన్ కార్డులు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు ఆహ్వానించిందన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేశామని, ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి నిజమైన లబ్దిదారులు అయితే రేషన్ కార్డు జారీ చేస్తారని రేవంత్ స్పష్టం చేశారు. కేవలం రేషన్ అందుకోవడానికే కాకుండా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు ఉయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసిందని, దీని వల్ల పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

ఖమ్మం జిల్లా ఏదులాపురంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అలాగే నర్సింగ్ కాలేజీని కూడా ప్రారంభించారు. కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మద్దులపల్లిలో మార్కెట్ యార్డుకు ప్రారంభోత్సవం చేశారు.