
విజయవాడలో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో ఎగుమతుల వృద్దే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవ్ జరుగుతోంది.

ఇవాళ, రేపు జరిగే ఈ భారీ వాణిజ్య సదస్సును సీఎం జగన్ ప్రారంభించారు. అజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. విజయవాడ SS కన్వెన్షన్ సెంటర్లో సెమినార్ జరుగుతోంది.

ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం జగన్ పరిశీలించారు. ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది.

ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.