
ఉల్లి గడ్డ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్ కుదేలవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరగడంతో మార్కెట్కు వెళ్లిన గృహిణులు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు.పది రోజుల క్రితం కిలో ఉల్లి 50 నుంచి 60 రూపాయలు పలకగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి 70 నుంచి 80 రూపాయల వరకు చేరింది.

వంటింట్లో అత్యంత ముఖ్యమైన కూరగాయల్లో ఉల్లిగడ్డ ఒకటి. ఉల్లి లేకుండా కూర వండటం కష్టమే కానీ ఇప్పుడు ఆ ఉల్లిగడ్డనే కొనాలంటే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉల్లి ధరలు రోజురోజుకూ ఘాటెక్కుతున్నాయి. మార్కెట్కు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన గృహిణులకు ఉల్లి ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలో దొరికిన ఉల్లి ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటుండటంతో వంటింటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది.

పదిరోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర 50 నుంచి 60 రూపాయల వరకు ఉండగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. అంటే తక్కువ వ్యవధిలోనే ఉల్లి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ఉల్లి కొనుగోలు చేయాలంటే వినియోగదారులపై మరింత భారం పడుతోంది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మార్కెట్లో ఉల్లి ధరలు పెరగడంతో గృహిణుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఇప్పుడు ఉల్లి ధరల పెరుగుదల కూడా అదనపు భారంగా మారింది.

మరోవైపు ఉల్లి ధరల ప్రభావం హోటళ్లపైనా పడుతోంది. హోటళ్లలో వంటకాలకు ఉల్లి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని హోటళ్లలో ఉల్లిపాయలను అందించడం తగ్గించారు. కొన్ని చోట్ల అయితే ఉల్లిపాయలు నో స్టాక్ అంటూ కస్టమర్లకు చెప్పే పరిస్థితి కనిపిస్తోంది.

మరికొన్ని హోటల్లలో ఉల్లిపాయలు కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు హోటల్లో భోజనం చేస్తే ఉల్లిపాయలు ఉచితంగానే వచ్చేవి. ఇప్పుడు అదే ఉల్లిపాయలకు ప్రత్యేకంగా చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వినియోగదారులు అంటున్నారు. ఇక కూరగాయల మార్కెట్లోనూ ఉల్లి ధరలే హాట్ టాపిక్గా మారాయి. ధరలు అడిగిన వెంటనే వినియోగదారులు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది.