మల్టీ విటమిన్లు మానవులపాలిట మరణమృదంగాన్ని మోగిస్తున్నాయంటున్నారు నిపుణులు. తాజాగా నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మల్టీవిటమిన్లు వాడకం ఎక్కువైతే ప్రాణాలు నిలిచే అవకాశం కంటే త్వరగా మరణించే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
తరచూ విటమిన్ల పేరుతో టాబ్లెట్లు తీసుకునే వారిలో.. మరణాల శాతం సాధారణం కంటే 4శాతం పెరిగిందని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. వీటిపై సరైన ఆధారాలు లభ్యంకానప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఈ సబ్సిట్యూట్స్ తీసుకోవడం వల్ల అనేక సమస్యలకు గురవుతున్నట్లు చెబుతున్నారు.
60ఏళ్ల వయసు పైబడిన సుమారు 3లక్షల మందిని వైద్య పరీక్షలు చేయగా అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు మాత్రమే అధికంగా ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అందులో విటమిన్ సి ద్వారా అధిక ప్రయోజనం పొందినట్లు తెలిపారు. దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే.. జీవితంలో పౌష్టిక ఆహారానికి మించింది మరేదీ లేదని మరోసారి రుజువైంది.
అయితే వాటికి బదులుగా ఇలాంటి మల్టీ విటమిన్ సబ్సిట్యూట్లపై ఆధారపడితే కొత్త వ్యాధులు ధరిచేరతాయని హెచ్చరిస్తున్నారు వైద్య పరిశోధకులు. మనం తరచూ తీసుకునే ఆహారంలో మంచి ఫ్యాట్, విటమిన్లు, పోషకాలు, లవణాలు పుష్టిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
తద్వారా ఎలాంటి వ్యాధులనైనా ఇట్టే అధిగమించే వ్యాధినిరోధక శక్తి శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. ఏదైనా ఆహారం మితంగా తీసుకుంటూ అధిక పోషక విలువలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.