
మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలకు రెక్కలొచ్చాయి.. చేపలు తినాలనే సెంటిమెంట్ తో జనం చేపల మార్కెట్ కు పరుగులు తీస్తున్నారు.. ఇదే అదునుగా వ్యాపారులు చేపల ధరలు అమాంతం పెంచేశారు.

మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగనే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది.

మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. గురువారం హైదరాబాద్లోని చేపల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్లు సమాచారం.

మృగశిర కార్తె ఎఫెక్ట్తో కొర్రమీను ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలోకు రూ.320 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ. 650 వరకు విక్రయించారు. బొచ్చ, రవ్వు చేపలను కిలో రూ.120 నుంచి రూ. 150కి, పాంప్లేట్ రూ. 90–120 విక్రయించారు.

ఇక మృగశిర కార్తె రోజు కచ్చితంగా చేపలు తినాలను చెబుతుంటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందేనని చెబుతుంటారు.