నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా కశ్మీర్లో యోగా డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీనగర్లోని డాల్ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతీయేట అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటూ ఉంటారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది. దీని ప్రాముఖ్యత విదేశాల్లోనూ పెరిగిందన్నారు.
యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని మోదీ తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. ఫ్రాన్స్కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ గుర్తుచేశారు.
విదేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు.
ఇప్పటికే అనేక పరిశోధనా పత్రాలు ప్రచురిం అయ్యాయి. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందన్నారు.
ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేశారు.
అక్కడ భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వేదికను షేర్-ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చడంతో కార్యక్రమం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగానూ ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు