
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చింతపండు ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఉంది. భారతదేశం నుండి చింతపండును అరబ్ దేశాలు, అమెరికా, యూరోపియన్ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తారు. కేవలం వంటకాల్లోనే కాకుండా, ఔషధాల తయారీలో, పారిశ్రామిక అవసరాల కోసం కూడా చింతపండును ఉపయోగిస్తారు.

భారతదేశం ఏటా లక్షల టన్నుల చింతపండును ఉత్పత్తి చేస్తూ, అంతర్జాతీయ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ, దేశీయంగా చూస్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం చింతపండు ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలుస్తుందని చాలా మందికి తెలియని విషయం. ఇక్కడి బస్తర్ ప్రాంతం చింతపండు సాగుకు, నాణ్యతకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

ఛత్తీస్గఢ్ - చింతపండు రాజధాని.. భారతదేశంలో చింతపండు అత్యధికంగా పండే రాష్ట్రం ఛత్తీస్గఢ్. ముఖ్యంగా బస్తర్ జిల్లాను చింతపండు హబ్గా పిలుస్తారు. ఇక్కడ పండే చింతపండు నాణ్యత చాలా బాగుంటుంది. అందుకే దీనికి విదేశీ మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా చింతపండు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ప్రపంచ మార్కెట్లో భారత్ ఆధిపత్యం: ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చింతపండులో సుమారు 50శాతం నుండి 60శాతం వాటా భారతదేశానిదే. మనం కేవలం చింతపండునే కాకుండా, చింతపండు గుజ్జు (Pulp), పొడి (Powder), గింజలను కూడా విదేశాలకు పంపిస్తున్నాము. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు భారతీయ చింతపండుకు ప్రధాన కొనుగోలుదారులు.

కేవలం వంటకాల్లోనే కాదు: చింతపండును కేవలం సాంబార్, రసం లేదా పచ్చళ్ల కోసం మాత్రమే కాకుండా, ఇతర పారిశ్రామిక రంగాలలో కూడా ఉపయోగిస్తారు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, విటమిన్ సి కోసం ఆయుర్వేద మందుల్లో వాడతారు. లోహాలను శుభ్రం చేయడానికి ముఖ్యంగా రాగి, ఇత్తడి పాత్రలు, వస్త్ర పరిశ్రమలో రంగుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. భారతదేశంలోని రైతులు, గిరిజన తెగలకు చింతపండు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రభుత్వాలు మరిన్ని మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే, చింతపండు ఎగుమతులు మరింత పెరిగి రైతులకు మేలు జరుగుతుంది.