తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ 'హర్ ఘర్ తిరంగ 2.0' ప్రచారంలో భాగంగా ఆన్లైన్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ePostOffice పోర్టల్ ద్వారా జాతీయ జెండాల విక్రయాలు ప్రారంభించినట్లు తాజాగా రాష్ట్ర పోస్టల్ శాఖ ప్రకటించింది.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా రాష్ట్ర పౌరుల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఆగస్టు 15న జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేసేందుకు వారిని ప్రోత్సహించడానికే ఆన్లైన్లో తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,214 పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలు విక్రయానికి అందుబాటులో ఉంచామని, ఒక్కో జెండాను రూ. 25 చొప్పున కొనుగోలు చేయవచ్చని ఓ ప్రకటనలో తెల్పింది.
ePostOffice పోర్టల్ ద్వారా ఆన్లైన్ కొనుగోలు ఎంపికలు ఆగస్టు 12 వరకు అందుబాటులో ఉంటాయి. ఒకరు ఆన్లైన్లో ఐదు జెండాల వరకు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఆగస్టు 13 వ తేదీన లేదా అంతకు ముందు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ చేయనున్నట్లు పోస్టల్ విభాగం తెల్పింది.