
జీర్ణక్రియ మందగిస్తుంది: తినేటప్పుడు మాట్లాడటం వల్ల కలిగే మొదటి నష్టం జీర్ణక్రియపై పడుతుంది. ఆహారం నోట్లోకి వెళ్లగానే లాలాజలం దాంతో కలవాలి. మనం మాట్లాడుతూ తిన్నప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలలేము. దీనివల్ల జీర్ణరసాలు ఆహారంతో కలవవు, ఫలితంగా అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

గాలి కడుపులోకి వెళ్తుంది: మనం మాట్లాడుతూ తింటున్నప్పుడు ఆహారంతో పాటు అధిక మొత్తంలో గాలి కూడా నోటి ద్వారా కడుపులోకి వెళుతుంది. దీనినే వైద్య పరిభాషలో ఏరోఫేజియా అంటారు. ఈ గాలి వల్ల కడుపులో అసౌకర్యం కలగడమే కాకుండా పదే పదే త్రేనుపులు రావడం, గ్యాస్ పట్టేయడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

ప్రాణాపాయం: చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. తింటూ మాట్లాడటం వల్ల ఆహారం అన్నవాహికలోకి వెళ్లడానికి బదులు పొరపాటున వాయుమార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల గొంతులో ఆహారం అడ్డం పడి ఊపిరి ఆడకపోవడం లేదా తీవ్రమైన దగ్గు రావడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు కూడా దారితీయవచ్చు.

నిశ్శబ్దంగా తింటే ప్రయోజనాలు: మాట్లాడకుండా తింటే ఆహారాన్ని బాగా నమిలి తింటాము. దీనివల్ల లాలాజలం బాగా కలిసి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఏకాగ్రతతో తిన్నప్పుడు మనం ఎంత తింటున్నామో మన మెదడుకు తెలుస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నప్పుడు శరీరం అందులోని విటమిన్లు, మినరల్స్ను మెరుగ్గా గ్రహిస్తుంది. భోజనం చేసే ఆ 15-20 నిమిషాలు ఫోన్లను పక్కన పెట్టి, సంభాషణలు ఆపి కేవలం ఆహారంపైనే దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.