ఆయుర్వేదంలో చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ముఖంపై మొటిమలను నివారించి, ముఖం మెరిసిపోయేలా చేయడానికి చందనం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా చందనం పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చందనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గంధాన్ని పొడి, పేస్ట్ లేదా నూనె రూపంలో ఉపయోగించవచ్చు. ఈ సహజ పదార్ధం చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. చందనం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. శాండల్వుడ్తో కలిగే లాభాలు, ఎలాంటి చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
చందనం పేస్ట్ అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. చందనం చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని అలర్జీల నుంచి రక్షిస్తుంది. ఒక చెంచా చందనం నూనె, చిటికెడు పసుపు, కర్పూరం కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: గంధంలోని తేలికపాటి ఎక్స్ఫోలియేటింగ్ గుణాల వల్ల.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది మీ చర్మంపై డార్క్ స్పాట్లను పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇది టాన్ తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ చందనం పొడి, కొబ్బరి నూనె కలపండి. దీన్ని మీ ముఖానికి పట్టించి, మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. డార్క్ స్పాట్స్ పోగొట్టుకోవడానికి రెగ్యులర్ గా ఉపయోగిస్తే నార్మల్ టాన్ వచ్చి, మచ్చలు మాయమై.. ముఖం మెరిసిపోతుంది.
ఏజ్ బ్రేక్!: చందనంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడుతాయి. ఇది చర్మం ముడతలు, వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా మార్చుతుంది. దీని కోసం 2 చెంచాల ముల్తానీ మట్టి, 2 చెంచాల గంధాన్ని కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ని ముఖానికి ప్యాక్లా అప్లై చేసుకోవాలి.15-20 నిమిషాలు అలాగే ఉంచి బాగా ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
డ్రై స్కిన్ రెమెడీ: చాలా మంది డ్రై, డల్ స్కిన్తో బాధపడుతుంటారు. అలాంటి వారు చందనం ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా పొడి, నిర్జీవ చర్మానికి చెక్ పెట్టవచ్చు. ఒక గిన్నెలో ఒక చెంచా పాలపొడి, కొన్ని చుక్కల గంధం నూనె, రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడిగేస్తే చర్మం తేమగా ఉంటుంది.
జిడ్డు చర్మం: జిడ్డు చర్మం వారి ముఖంపై మురికి, ధూళి పేరుకుపోతుంది. అలాంటి వారికి చందనం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అర చెంచా గంధపు పొడి, కొద్దిగా టామాటా రసం, అర చెంచా ముల్తానీ మట్టి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.