ఈ మధ్య కాలంలో అందంపై దృష్టి ఎక్కువ పెడుతున్నారు చాలా మంది. ఫేస్ ప్యాకులు, ఫేస్ క్రీములు, మాయిశ్చరైజర్లు ఇక చెప్పుకుంటూ పోతే వీటి జాబితా చేతాడంత ఉంటుంది. అందులోనూ అలిసి పోయిన ముఖం కోసం కూడా అనేక బ్యాటీ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. పని ఒత్తిడి కారణంగా ముఖంలో అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
అదే క్రమంలో ఏదైనా ఫంక్షన్లకు, పార్టీలకు హాజరవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మన ముఖాన్ని కాంతివంతంగా చేసుకునేందుకు, అలసిపోయిన ముఖం తిరిగి జీవం పుంజుకునేందుకు మాస్క్ వేస్తూ ఉంటారు. వాటివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే ఇంట్లోనే ఉన్న కొన్నింటిని ప్రయత్నించొచ్చని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. పైగా వీటిలో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని అవిసెలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు చాల మంది. అయితే ఇవి అందానికి చేసే మేలెంతో ఇప్పుడు చూద్దాం.
రెండు కప్పుల నీటికి పావుకప్పు అవిసెలను చేర్చి మరిగించండి. జెల్లా అయ్యాక దింపేసి చల్లారనివ్వాలి. జెల్ని వడకట్టి, ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగేస్తే సరి. ఇది చర్మానికి తేమను అందించడమే కాదు, ముడతలు, గీతలనూ దరిచేరనీయదు. కొల్లాజెన్ ఉత్పత్తినీ పెంచుతుంది. ఈ జెల్ని ఒకసారి చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే నెలరోజులు ఉంటుంది.
స్పూను కలబంద గుజ్జుకు రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీమ్, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ మాస్క్ చర్మానికి పోషణనివ్వడంతోపాటు ఆరోగ్యంగా కనిపించేలానూ చేస్తుంది. అలర్జీలు, ఎరుపెక్కడం నుంచీ కాపాడుతుంది.
30 దాటాయో లేదో చర్మం నిర్జీవంగా మారడం, చర్మరంధ్రాలు పెద్దవిగా కనిపించడం సహజమే. అవి తగ్గి, యవ్వనవంతమైన లుక్ కావాలంటే.. గుడ్డు తెల్లసొనకు రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి, బాగా గిలకొట్టాలి. ఆపై ముఖానికి వేసి, పావుగంటయ్యాక కడిగేస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం.