
ICC ODI World Cup: భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ 2023 కోసం ఐసీసీ నుంచి మంగళవారం టోర్నీ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ వచ్చిందంటే పాకిస్థాన్ జట్టు టోర్నీ కోసం భారత్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే భారత్కి తమ జట్టు వచ్చేది రానిది పాక్ ప్రభుత్వం నిర్ణయించి చెబుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే..? టోర్నీలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి..?

పాకిస్తాన్ ప్రభుత్వం తమ క్రికెట్ జట్టును భారత్కు పంపడానికి అనుమతించకపోతే, పాక్ టీమ్ టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీ విధించే శిక్షను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ టీమ్ భారత్కు రాకపోతే.. ఆఖరి క్షణంలో ఐసీసీ పాక్ స్థానంలో మరో జట్టును కూడా టోర్నీలో ఆడేందుకు చేర్చుకోవచ్చు. ఆ జట్టు పాకిస్థాన్ని భర్తీ చేస్తుంది.

పాకిస్తాన్ స్థానంలో ఐసీసీ మరే ఇతర దేశాన్ని టోర్నీలోకి చేర్చకూడదని నిర్ణయిస్తే.. టోర్నమెంట్ తొమ్మిది జట్లతోనే జరుగుతుంది. అలాగే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడాల్సిన జట్లకు ఆ మ్యాచ్ కోసం రెండు పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది.

ఒకవేళ భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్లో పాక్ జట్టు పాల్గొనకపోతే.. పాకిస్థాన్ లేకుండానే ప్రపంచకప్ ఆడడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా, పాకిస్థాన్ టీమ్ 1992 వరల్డ్కప్ టోర్నీలో విజేతగా నిలిచింది.