
ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి చూపు కింగ్ కోహ్లీపైనే నిలిచింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ అద్భుతమైన రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉంది. దీంతో క్రిస్ గేల్, రోహిత్ శర్మల లిస్ట్ లో చేరనున్నాడు.

భారత క్రికెట్ దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలో మరో అద్భుత రికార్డును సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో 300 సిక్సర్ల మార్కును చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా కేవలం 9 సిక్సర్లు మాత్రమే అవసరం. ఇప్పటివరకు ఆడిన 267 మ్యాచ్లలో కోహ్లీ మొత్తం 291 సిక్సర్లు బాదాడు. ఒకవేళ సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే తొలి మ్యాచ్లోనే ఆయన ఈ ఘనత సాధిస్తే, ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన మూడో బ్యాటర్గా చరిత్రకెక్కుతాడు.

ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ కేవలం 142 మ్యాచ్లలోనే 357 సిక్సర్లు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2025 సీజన్లోనే ఈ 300 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. రోహిత్ ప్రస్తుతం 272 మ్యాచ్లలో 302 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరి సరసన చేరే అవకాశం విరాట్ కోహ్లీకి లభించింది.

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. కోహ్లీకి ఇది సొంత మైదానం కావడం విశేషం. ఈ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం కావడంతో కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆయన 39.54 సగటుతో మొత్తం 8661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు ఉండటం గమనార్హం.

2026 మెగా వేలానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం విరాట్ కోహ్లీని 21 కోట్ల రూపాయల భారీ ధరకు అట్టిపెట్టుకుంది (రిటైన్ చేసుకుంది). జట్టుపై ఆయనకున్న ప్రాముఖ్యతను ఇది చాటిచెబుతోంది. గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. శనివారం రాత్రి జరగబోయే ఈ పోరులో కోహ్లీ సిక్సర్ల సునామీ సృష్టించి 300 మార్కును చేరుకుంటాడో లేదో వేచి చూడాలి.