
రిషబ్ పంత్ ఎప్పుడు తిరిగి వస్తాడు? ఎప్పుడు మైదానంలోకి దూసుకెళ్లి లాంగ్ సిక్సర్లు కొడతాడో? కోట్లాది మంది క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. అయితే, తాజాగా పంత్ రీఎంట్రీపై కీలక అప్ డేట్ వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ఈ ఏడాది రిషబ్ పంత్ పునరాగమనం చేయడం కష్టమే. అయితే అతను వచ్చే ఏడాది ప్రారంభంలో టీమ్ ఇండియాకు తిరిగి వస్తాడని తెలుస్తోంది.

NCA నుంచి అందిన నివేదికల ప్రకారం, రిషబ్ పంత్ ఇప్పుడు మునుపటిలా బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అతను 140 కి.మీ. కంటే వేగమైన బంతులు ఆడటం మొదలుపెట్టాడు. తన కాళ్లు, వీపు కింది భాగం సరిగ్గా పనిచేసినప్పుడే ఇలాంటి ఫాస్ట్ బంతులు ఆడగలడు. పంత్కి ప్రస్తుతం ఇప్పుడంతా బాగానే ఉంది.

అయితే, బీసీసీఐ మాత్రం పంత్ పునరాగమనంపై తొందరపడాలని కోరుకోవడం లేదు. పంత్కు పూర్తిగా కోలుకునే సమయం ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ ఏడాది పంత్ తిరిగి రాకపోవడానికి ఇదే కారణం.

వచ్చే ఏడాది జరగనున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నుంచి రిషబ్ పంత్కు మళ్లీ జట్టులో అవకాశం కల్పించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. అన్నీ సరిగ్గా జరిగితే, పంత్ జనవరి 2024లో తిరిగి వస్తాడు.

30 డిసెంబర్ 2022న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పంత్ కారుకు మంటలు అంటుకున్నాయి. ఎలాగోలా అతడి ప్రాణాలు కాపాడి ముంబైలో సర్జరీ చేశారు. పంత్ వేగంగా కోలుకోవడం గర్వించదగ్గ విషయం.