అక్టోబర్ 24 సాయంత్రం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కోలాహలం మొదలుకానుంది. యూఏఈ ప్రాంగణంలో భారత్-పాక్ల మధ్య హోరాహోరీ పోరు కేంద్రంగా ఈ సందడి మొదలుకానుంది. ఈ మ్యాచ్లో భారత్ సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్కు చెందిన కొందరు ప్లేయర్లపై చర్చ జరుగుతోంది. వీరంతా విరాట్ కోహ్లీ పారథ్యంలోని టీమిండియాతో తలపడటం ఇదే మొదటిసారి. దీంతో వీరు ఎలా ఆడనున్నారో, అసలు వీరెవరో ఓ సారి చూద్దాం.
బాబర్ అజమ్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ భారత్పై పోరులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇంతకు ముందు జరిగినది చరిత్ర, నేను వచ్చాక ఆ చరిత్రను మారుస్తా అంటూ పాక్ ప్లేయర్లకు నూతనోత్సాహం కలిగించేలా మాట్లాడాడు. భారత్తో పోరుకు ఎంతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. యూఏఈలో ఎక్కువ క్రికెట్ ఆడటం ద్వారా తమ జట్టు లాభపడుతుందని బాబర్ విశ్వసిస్తున్నాడు. బాబర్ ఇప్పటివరకు ఆడిన 22 టీ20 ఇంటర్నేషనల్స్లో 2204 పరుగులు చేశాడు. అందులో 122 పరుగులు అతని అత్యుత్తమ స్కోర్. ఒక సెంచరీతో పాటు 20 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
మహ్మద్ రిజ్వాన్: వికెట్ కీపర్ నుంచి ఓపెనర్ వరకు రిజ్వాన్ పాకిస్తాన్ టీంకు అత్యంత కీలక ప్లేయర్. ఈ ఏడాది ఆడిన టీ20 ఇంటర్నేషనల్స్లో 94 సగటు, 140.03 స్ట్రైక్ రేట్తో 752 పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 43 మ్యాచ్లు ఆడి ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలతో సహా 1065 పరుగులు చేశాడు.
షాహీన్ షా ఆఫ్రిది: మహ్మద్ అమీర్ ప్రకారం, షహీన్ షా ఆఫ్రిది ప్రస్తుతం పాకిస్థాన్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్గా ఉన్నాడు. 6 అడుగుల 6 అంగుళాల పొడవున్న ఈ ఫాస్ట్ బౌలర్ కొత్త బంతితో వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. షహీన్ ఇప్పటి వరకు ఆడిన 30 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 32 వికెట్లు తీశాడు. ఈ సమయంలో ఎకానమీ రేటు 8.17 గా ఉంది.
హసన్ అలీ: ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలవడంలో హసన్ అలీ కీలక పాత్ర పోషించాడు. ఇందులో 13 వికెట్లు తీశాడు. హసన్ అలీ తన 41 టీ 20 అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 52 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 8.29 గా ఉంది. 18 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్గా రికార్డయింది.
మహ్మద్ హఫీజ్: హఫీజ్ చాలా సీనియర్ ప్లేయర్. హఫీజ్ పాకిస్తాన్ తరఫున 113 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఇందులో అతను 14 అర్ధ సెంచరీలతో 2429 పరుగులు చేశాడు. అలాగే 60 టీ20 అంతర్జాతీయ వికెట్లు కూడా తీసుకున్నాడు.