
KL Rahul and Shreyas Iyer: వెస్టిండీస్ టూర్లో టీ20 సిరీస్ ఓటమి షాక్తో భారత క్రికెట్ జట్టు స్వదేశానికి తిరిగి వస్తోంది. కాగా, 2023 ఆసియా కప్నకు భారత జట్టును ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు జట్టులోకి పునరాగమనం చేసేందుకు పోరాడుతున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ల భవితవ్యం కూడా నేడు తేలనుంది.

శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరూ ప్రాక్టీస్ ప్రారంభించారు. సోమవారం NCAలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, కనిపించారు. వీరిద్దరి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారిని ఆసియా కప్నకు ఎంపిక చేయనున్నారు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు లేదా ఈ వారంలో ఆసియా కప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్ట్ చివరిలో శ్రీలంకకు బయలుదేరే ముందు ఆటగాళ్ల శిబిరం కోసం ఆగస్ట్ 23న NCAలో అందరు ఆటగాళ్లు కలుస్తారు. దీంతో నేడు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ దేహదారుఢ్య పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు పూర్తిగా ఫిట్గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

వన్డేల్లో రాహుల్ భారత్ బ్యాకప్ వికెట్ కీపర్. కాగా, అయ్యర్ ఆసియా కప్లో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలి. దీంతో వీరిద్దరూ ప్రపంచకప్లో స్థానం దక్కించుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

IPL 2023 సమయంలో కేఎల్ రాహుల్ స్నాయువు గాయంతో బాధపడ్డాడు. అతనికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అయ్యర్ మాత్రం వెన్నునొప్పితో బాధపడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. ఐర్లాండ్తో జరిగే సిరీస్కు ఎంపికయ్యాడు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆసియా కప్ శ్రీలంక, పాకిస్థాన్లలో జరగనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. సెప్టెంబరు 2న పాకిస్థాన్తో టీమిండియా ఆసియా కప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. విశేషమేమిటంటే భారత్కు సంబంధించిన అన్ని మ్యాచ్లు శ్రీలంకలో జరగనుండగా, ఈ మ్యాచ్ల కోసం మిగతా జట్లు లంకకు చేరుకోవడం విశేషం.