
అదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 ఐదో మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్లో మెరిసిన విరాట్ కోహ్లి(82*)-ఫాఫ్ డుప్లెసిస్(73) శుభారంభం అందించి జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.

మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ జట్టు విజయం గురించి మాట్లాడుతూ..‘బౌలింగ్లో మాకు మంచి ఆరంభం లభించింది. ప్రధానంగా పవర్ ప్లేలో మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థిని అదుపు చేశాడు. తన చివరి 2-3 ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేశాడ’ని చెప్పాడు.

‘రెండో ఇన్నింగ్స్లో పరుగులు ఎలా ఛేజ్ చేయాలో మాకు స్పష్టంగా తెలుసు. అనుకున్నట్లే చేశాం. పేస్ బౌలర్లు బౌలింగ్ చేస్తే బ్యాటర్లకు కష్టమే. స్పిన్నర్లు ఇక్కడ కొంత విజయం సాధించారు. ఫలితంగానే ఐపీఎల్ 16వ సీజన్లో మా తొలి మ్యాచ్లో జట్టు విజయాన్ని కైవసం చేసుకుంద’ని ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు.

ఇంకా ‘ఐపీఎల్ 16వ సీజన్లో ఇది మా తొలి మ్యాచ్. విరాట్ కోహ్లీ లాంటి ప్రత్యేక ఆటగాడితో ఆడడం సంతోషంగా ఉంది. అతని శక్తి అమోఘం. టీమ్లో యంగ్స్టర్లు ఉన్నప్పుడు, మనకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. మేమంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఈ విజయం మాకు పెద్దది’ అని ఆర్సీబీ కెప్టెన్ పేర్కొన్నాడు.

అనంతరం మాట్లాడిన రోహిత్ తొలి ఆరు ఓవర్లలో తమ ఆరంభం గొప్పగా లేదని ఓడిపోయిన అన్నాడు. కానీ తర్వాత వచ్చిన తిలక్, ఇంకా కొందరు బ్యాటర్లు చాలా కృషి చేశారని, అయితే ప్రణాళిక ప్రకారం బౌలింగ్ జరగలేదని చెప్పాడు.

‘ఈ పిచ్ బ్యాటర్లకు మరింతగా ఉపయోగపడింది. తిలక్ వర్మ పాజిటివ్ ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్. అతను కొట్టిన కొన్ని షాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఛాలెంజింగ్ మొత్తాన్ని పెంచడంలో మాకు సహాయం చేసినందుకు తిలక్కు హ్యాట్సాఫ్. ఈ పిచ్ ప్రకారం మేం లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. మా శక్తికి తగ్గట్టు సగం కూడా ఆడలేద’ని రోహిత్ శర్మ తెలిపాడు.

‘గత 6-8 నెలలుగా నేను జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. గాయాలు మా చేతుల్లో లేవు. మేము దాని గురించి ఏమీ చేయలేము. ఇతర ఆటగాళ్లు కూడా ప్రతిభావంతులు. వారిని ఆదుకోవాలి. ఈ సీజన్లో ఇది తొలి గేమ్ మాత్రమే. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. వాటి కోసం ఎదురుచూస్తున్నామ’ని రోహిత్ చెప్పాడు.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. తిలక్ వర్మ అజేయంగా 84 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 16.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది ఆర్సీబీ. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అజేయంగా 82, ఫాప్ డుప్లెసిస్ 73 పరుగులు, గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా అజేయంగా 12 పరుగులు చేయడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.