
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనపై మాజీ భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కోహ్లీ ఆటతీరును విశ్లేషిస్తూ, అతని టెస్ట్ కెరీర్కు ముగింపు పలికిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) నాటి సమస్యలు మళ్లీ తిరగబెట్టాయని పఠాన్ అభిప్రాయపడ్డారు.

పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ 8 పరుగులు చేసి ఔట్ కాగా, విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చిన తర్వాత ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడంపై ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన పఠాన్.. "ఫిట్నెస్ ఒక విషయం, మ్యాచ్ ఆడే సమయం మరొక విషయం. అందుకే రోహిత్ కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపించాడు. ఇక విరాట్కు BGT (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ) నాటి బూతాలు మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపించింది. అడిలైడ్, సిడ్నీలలో అలా జరగకూడదని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. అతను ఆఫ్-స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా ఆడబోయి పాయింట్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ శర్మ ఫిట్నెస్పై ఎంత కృషి చేసినప్పటికీ, కొంతకాలం మ్యాచ్లు ఆడకపోవడం వల్ల అతను కొత్త బంతిని ఎదుర్కోవడానికి తడబడినట్లు పఠాన్ పేర్కొన్నారు.

క్రికెటర్లకు కేవలం శారీరక ఫిట్నెస్ మాత్రమే కాకుండా, తరచుగా మ్యాచ్లు ఆడే 'గేమ్ టైమ్' కూడా చాలా ముఖ్యమని పఠాన్ నొక్కి చెప్పారు. విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు కాస్త ముందుగా వెళ్లి కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం మంచిదని, అలా జరగకపోవడం వల్లే భారత బ్యాటర్లు బౌన్స్, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో తడబడ్డారని పఠాన్ అభిప్రాయపడ్డారు. "ముందుకు వెళ్లే క్రమంలో మనం ఈ విషయాల గురించి ఆలోచించడం ముఖ్యం. ఒకటి రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడి ఉంటే, ఈ పొరపాట్లు జరిగేవి కావు" అని పఠాన్ తెలిపారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే వారి లక్ష్యానికి 'గేమ్ టైమ్' లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారుతుందని పఠాన్ గతంలో కూడా హెచ్చరించారు. రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే, ఫిట్గా ఉండేందుకు వీరు దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆయన సూచించారు. ఈ ఓటమి తర్వాత, తదుపరి మ్యాచ్లు అడిలైడ్, సిడ్నీలలో జరగనున్నాయి. ఈ సీనియర్ ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చి, ఆస్ట్రేలియాపై భారత్కు సిరీస్ విజయాన్ని అందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.