
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ ఎంతో కష్టతరంగా సాగింది. మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో లేకపోవడంతో ఆరంభ మ్యాచుల్లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై జట్టు తీవ్రంగా తడబడింది. వరుసగా మొదటి మూడు మ్యాచుల్లో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్పై సాధించిన విజయంతో జట్టులో కాస్త నమ్మకం పెరిగింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసిన చెన్నై, పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు అధికారికంగా ఆవిరైపోయాయి.

రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల యువ బ్యాటర్ కార్తీక్ శర్మపై ఐపీఎల్ వేలానికి ముందే అందరి దృష్టి పడింది. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లోనే ఉత్తరాఖండ్పై అద్భుత సెంచరీతో మెరిసిన కార్తీక్, ఆ తర్వాత దేశీవాళీ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ వేలంలో చెన్నై ఏకంగా రూ. 14.2 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ భారతీయ ఆటగాడిగా ప్రశాంత్ వీర్తో కలిసి కార్తీక్ రికార్డు సృష్టించాడు. ఈ భారీ కాంట్రాక్ట్ మొత్తంతో పాటు, ఆడిన ప్రతి మ్యాచ్కు రూ. 7.5 లక్షల చొప్పున 11 మ్యాచులకు గానూ రూ. 82.5 లక్షల మ్యాచ్ ఫీజును అందుకున్నాడు. దీని ప్రకారం ఈ సీజన్లో కార్తీక్ శర్మ మొత్తం సంపాదన అక్షరాలా రూ. 15,02,50,000 కి చేరింది.

భారీ ధర పలకడంతో కార్తీక్ శర్మపై అభిమానుల, విశ్లేషకుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తన మొదటి మ్యాచ్లో 18 పరుగులు చేసిన కార్తీక్, ఆ తర్వాత వరుస మ్యాచుల్లో 1, 6, 18, 15 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో అతడి ఫామ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ముంబై ఇండియన్స్తో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో అజేయంగా 54 పరుగులు చేసి ఫామ్లోకి రావడంతో కార్తీక్ శర్మ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సీజన్లో మొత్తం 11 ఇన్నింగ్స్ల్లో 136.57 స్ట్రైక్ రేట్తో, 32.78 సగటుతో కార్తీక్ 295 పరుగులు సాధించాడు.

కార్తీక్ శర్మ సంపాదనను అతను చేసిన పరుగులతో లెక్కించి చూస్తే ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ 2026లో కార్తీక్ చేసిన ఒక్కో పరుగుకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 5,09,322.03 ఖర్చు చేసింది. అరంగేట్రం చేసిన ఒక యువ ఆటగాడికి ఈ స్థాయి ఖర్చు చాలా ఎక్కువే అయినప్పటికీ, టోర్నమెంట్ ద్వితీయార్థంలో అతను ఆడిన కీలక ఇన్నింగ్స్లు జట్టు మిడిలార్డర్కు కొండంత అండగా నిలిచాయి.

భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లతో బలమైన జట్టును నిర్మించాలనే ఆలోచనలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2027 వేలానికి ముందే కార్తీక్ శర్మను తమ జట్టులోనే ఉంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూకుడుగా ఆడే మిడిలార్డర్ బ్యాటర్గా మాత్రమే కాకుండా, సంజూ శాంసన్కు ప్రత్యామ్నాయంగా వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వహించగల సామర్థ్యం కార్తీక్ సొంతం. ఈ అనుభవం వచ్చే సీజన్లో అతను మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం.