
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్లో శనివారం RCBతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రార్ అర్ధ సెంచరీలతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

ఈ కఠినమైన లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిల్ సాల్ట్ కేవలం 45 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కాగా ఢిల్లీ అరుణ్ జైట్లీ గ్రౌండ్ విరాట్ కోహ్లీకి హోం గ్రౌండ్. అయితే బాలీవుడ్ నటి అనూష్క శర్మతో పెళ్లయిన తరువాత తన ఫ్యామిలీని ముంబైకి షిఫ్ట్ చేశాడు కోహ్లీ.

అందుకే కోహ్లీని చూడడానికి చాలామంది అభిమానులు తరలివచ్చారు. అందులో టీమిండియా లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు కూడా ఉన్నారు. మ్యాచ్ తర్వాత కోహ్లీతో కలిసి ఫొటోలు దిగారు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కూడా తండ్రి లాగే క్రికెటర్ కావాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఢిల్లీ జూనియర్ జట్టులో చోటు సంపాదించాడు.