
IPL 2023 PBKS vs RCB: మొహాలీ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఫాఫ్ డుప్లెసిస్ ఈ మ్యాచ్లో ఫీల్డింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఫాఫ్ను ఇంపాక్ట్ సబ్గా ఎంపిక చేసి విరాట్ కోహ్లీకి టీమ్ కెప్టెన్సీ అప్పగించింది ఆర్సీబీ ఫ్రాంచైజీ.

ఆర్సీబీ జట్టు కెప్టెన్గా పంజాబ్ కింగ్స్పై ఆడిన విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన కింగ్ కోహ్లీ 47 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 59 పరుగులు చేశాడు.

1. ఈ 59 పరుగులతో కింగ్ కోహ్లీ టీ20 క్రికెట్లో కెప్టెన్గా 6500 పరుగులు చేసిన ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 229 మ్యాచ్లలో మొత్తం 6903 ఐపీఎల్ పరుగులు చేసిన కోహ్లీ.. ఆర్సీబీ కెప్టెన్గా 5333 పరుగులు, అలాగే టీమిండియా టీ20 కెప్టెన్గా 1570 పరుగులు చేశాడు. ఇలా టీ20 క్రికెట్లో కెప్టెన్గా 6500 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మ్యాన్గా కోహ్లీ నిలిచాడు.

2. ఈ మ్యాచ్లో 5 ఫోర్లు కొట్టిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్లో 600 ఫోర్లు కొట్టిన ప్రత్యేక రికార్డును కూడా లిఖించాడు. మొత్తం 730 ఐపీఎల్ ఫోర్లతో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు 603 ఫోర్లు కొట్టి మూడో స్థానంలో నిలిచాడు కింగ్ కోహ్లీ. ఇంకా RCB తరఫున ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మ్యాన్ కూడా కోహ్లీనే.

3. పంజాబ్ కింగ్స్పై చేసిన అర్ధ సెంచరీతో, T20 క్రికెట్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన భారతీయ ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో 96 అర్ధశతకాలు బాదిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి 366 టీ20 ఇన్నింగ్స్ల ద్వారా మొత్తం 89 అర్ధ సెంచరీలు సాధించి హాఫ్ సెంచరీల జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నాడు.

4. అలాగే, టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 30 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాట్స్మెన్గా కింగ్ కోహ్లి రికార్డును కూడా లిఖించాడు. విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో 100 సార్లు 30కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కింగ్ కోహ్లి మాత్రమే.