ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రికెట్ అభిమానులు ఎదురుచూసే మ్యాచ్లలో ఇది కూడా ఒకటి. అయితే ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాక తనపై గతంలో ఉన్న రికార్డును మరోసారి సమం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయారు. ఈ క్రమంలో చెన్నై తరఫున డెవాన్ కాన్వేయ్ 6, అజింక్యా రహానే 2, శివమ్ దుబే 5 సిక్సర్లు బాదారు. అలాగే అంబటి రాయుడు ఒక సిక్సర్, మొయిన్ ఆలీ 2, జడేజా సైతం 1 సిక్సర్ కొట్టాడు. అంటే చెన్నై ఇన్నింగ్స్లో మొత్తం 17 సిక్సర్లు నమోదయ్యాయి.
అనంతరం వచ్చిన ఆర్సీబీ 20 ఓవర్లలో218 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 8 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓటమిపాలైంది. చెన్నై బ్యాటర్ల మాదిరిగానే బెంగళూరు ఆటగాళ్లు కూడా 16 సిక్సర్లు బాదారు. ఈ క్రమంలో కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ 4, గ్లెన్ మ్యాక్స్వెల్ 8, షహ్బాజ్ అహ్మద్ 1, దినేష్ కార్తిక్ 1, సుయాష్ ప్రభుదేశాయ్ 2 సిక్లర్లు కొట్టారు.
అంటే బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన ఆర్సీబీ, చెన్నై మ్యాచ్లో ఏకంగా 33 సిక్సర్లు నమోదయ్యాయి. ఒక ఐపీఎల్ మ్యాచ్లో అత్యధికంగా 33 సిక్సర్లు నమోదు కావడం ఇది మూడోసారి. ఇక మొదటి సారిగా 33 సిక్సర్లు నమోదైన మ్యాచ్ కూడా ఆర్సీబీ, చెన్నై జట్ల మధ్యే 2018లో జరిగింది. రెండో సారి 33 సిక్సర్లు నమోదైన మ్యాచ్లో కూడా చెన్నై టీమ్ ఉంది.. అయితే 2020 ఐపీఎల్ సీజన్లో జరిగిన ఈ మ్యాచ్ చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది.
ఇలా ఆర్సీబీ, చెన్నై జట్లు సోమవారం జరిగిన మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించి, తమపై ఉమ్మడిగా ఉన్న రికార్డును తామే సమం చేసుకున్నాయి.