
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భారత జట్టు తొలి ఓటమిని చవిచూసింది. షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు గెలిచి సూపర్-సిక్స్లోకి ప్రవేశించింది. అయితే సూపర్ సిక్స్ గ్రూప్-1లో భాగంగా ఆసీస్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

పోచెఫ్స్ట్రూమ్లో శనివారం జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించబడిన తర్వాత భారత బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. సీనియర్ క్రికెట్ లో అనుభవం ఉన్న కెప్టెన్ షెఫాలీ (8), వికెట్ కీపర్ రిచా ఘోష్ (7) పూర్తిగా విఫలమవడంతో జట్టు 18.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటైంది.

టోర్నీలో తొలి మూడు మ్యాచ్ల్లో భారత్ భారీ స్కోరు చేయగా అందులో శ్వేతా సెహ్రావత్ కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా శ్వేత 21 పరుగులతో భారత్లో టాప్ స్కోరర్గా నిలిచింది.

స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అమీ స్మిత్ 26 పరుగులతో టాప్స్కోరర్గా నిలిచింది.

ఈ ఓటమితో టీమిండియా నెట్ రన్ రేట్ (+1.905) బాగా దెబ్బతింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్లో ఆదివారం (జనవరి 22) శ్రీలంకను ఢీకొట్టనుంది.