
బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును ఓడించి చరిత్ర సృష్టించింది.

రెండు జట్ల మధ్య జరిగిన ఈ టెస్టు డే-నైట్ మ్యాచ్, ఈ తరహా టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే తొలిసారి. అలాగే 36 ఏళ్ల తర్వాత బిస్బేన్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాను ఓడించింది.

అంతే కాదు, 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ టెస్టు విజయం సాధించింది. అంతకుముందు 1997 ఫిబ్రవరిలో పెర్త్ మైదానంలో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు చివరిసారిగా గెలిచింది. ఇప్పుడు ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల జాబితాలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్టు సిరీస్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మార్పు వచ్చింది. ఈ సిరీస్ తర్వాత కూడా ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ, జట్టు విజయాల శాతం తక్కువగా ఉంది. ఈ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా విజయ శాతం 61.11% ఉండగా, ఇప్పుడు అది 55%కి తగ్గింది.

హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్కు ముందు పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానంలో ఉంది. టీమ్ ఇండియా గెలుపు శాతం 54.16గా ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉండేది. కానీ, ఓడిపోవడంతో ఘోరంగా నష్టపోవాల్సి వచ్చింది.

తొలి టెస్టులో ఓటమితో భారత జట్టు రెండో స్థానం నుంచి ఏకంగా 5వ స్థానానికి పడిపోయింది. భారత జట్టు పాయింట్ల శాతం కూడా దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 43. 33 పాయింట్లు ఉన్నాయి. దీంతో దక్షిణాఫ్రికా (50) రెండో స్థానం చేరుకుంది. న్యూజిలాండ్ మూడో స్థానం(50)లో నిలిచింది.

డే-నైట్ టెస్టులో తొలి రోజు వెస్టిండీస్ 311 పరుగులు చేసింది. దీంతో రెండో రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో 215 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 207 పరుగులకే ఆలౌటయి 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.