
ICC U19 World Cup: ICC అండర్-19 ప్రపంచకప్ 1988లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ప్రతి 2 సంవత్సరాలకు జరుగుతుంది. అయితే గత 34 సంవత్సరాలలో ఇప్పటివరకు 13 సీజన్లను మాత్రమే నిర్వహించారు. మొదటి, రెండవ సీజన్ల మధ్య 10 సంవత్సరాల సుదీర్ఘ గ్యాప్ ఉంది. 1988లో మొదటి సీజన్ ఆడిన తర్వాత, ICC రెండవ సీజన్ను 1998లో దక్షిణాఫ్రికాలో నిర్వహించింది.

ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్నకు భారత్ ఇంతవరకు ఆతిథ్యం ఇవ్వలేదు. ఇదిలావుండగా ఈ టోర్నీలో తన ఆధిపత్యాన్ని మాత్రం కొనసాగిస్తోంది. ఈ ICC ఈవెంట్లో భారతదేశం మొదటి ఛాంపియన్గా ఉండకపోవచ్చు, కానీ, టైటిల్ను గెలుచుకోవడంలో ఇది ఖచ్చితంగా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్లో భారత జట్టు ఇప్పటి వరకు అత్యధిక సార్లు టైటిల్ను కైవసం చేసుకుంది.

1988, 1998 అండర్ 19 ప్రపంచ కప్లో వైఫల్యం తర్వాత, 2000 సంవత్సరంలో శ్రీలంకలో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్లో భారతదేశం మొదటి సారి విజయాన్ని అందుకుంది. మహ్మద్ కైఫ్ సారథ్యంలోని భారత జట్టు కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది.

21వ శతాబ్దపు మొదటి అండర్ 19 ప్రపంచ ఛాంపియన్ తన విజయాన్ని పునరావృతం చేయడానికి మళ్లీ చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో 3 సీజన్లు గడిచిపోయాయి. న్యూజిలాండ్ (2002), బంగ్లాదేశ్ (2004), శ్రీలంక (2006)లో భారత జట్టు ఘోర వైఫల్యాలను చవిచూడాల్సి వచ్చింది. 2006 అండర్ 19 ప్రపంచ కప్లో భారత్ చివరి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో 38 పరుగుల తేడాతో ఓడిపోవడం అతిపెద్ద తలనొప్పిగా మారింది.

ఈ వైఫల్యాలు చివరకు మలేషియాలో జరిగిన 2008 అండర్-19 ప్రపంచ కప్లో ముగిశాయి. విరాట్ కోహ్లి సారథ్యంలో భారత అండర్-19 జట్టు మరోసారి టైటిల్ను కైవసం చేసుకుని రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. వర్షం ప్రభావంతో జరిగిన ఫైనల్లో భారత్ డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.

అయితే తర్వాతి సీజన్లో మళ్లీ భారత్ పరాజయం పాలైంది. అయితే 2012లో మాత్రం మరోసారి తన సత్తా చాటింది. ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి అండర్-19 ప్రపంచకప్ను నిర్వహించారు. ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని భారత్ ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్లో భారత్ చాంపియన్గా నిలవడం ఇది మూడోసారి.

తర్వాతి 2 సీజన్లలో మళ్లీ టైటిల్ గెలవకుండానే భారత్ బ్యాగ్ ఖాళీగా ఉంది. యూఏఈ (2014), బంగ్లాదేశ్ (2016)లో జరిగిన ఈవెంట్లలో భారత్కు నిరాశే ఎదురైంది. ఇక 2018లో న్యూజిలాండ్లో టోర్నీని నిర్వహించారు. ఇక్కడ భారత్ నాలుగోసారి ఛాంపియన్గా అవతరించడం మాత్రం మిస్ కాలేదు. పృథ్వీ షా కెప్టెన్సీలో భారత అండర్-19 జట్టు ఈసారి ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2020లో ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరడంతో.. 5వ సారి టైటిల్ను కైవసం చేసుకోవడం ఖాయమని అందరూ దాదాపుగా ఊహించారు. ఎందుకంటే ఫైనల్లో భారత్ అంత బలంగా లేని బంగ్లాదేశ్తో మ్యాచ్ జరిగింది. కానీ, ఈ కాన్ఫిడెన్స్ టీమ్ ఇండియాను ముంచేసింది. వర్షం ప్రభావంతో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లా మొదటిసారి టైటిల్ను కైవసం చేసుకుంది.