కోహ్లీ, రాహుల్, షమీ, బుమ్రా.. ఇలా సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమైనా.. బజ్బాల్ను మడతపెట్టేశారు టీమిండియా యువ ప్లేయర్లు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయఢంకా మోగించింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించి.. మరో టెస్ట్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ టెస్టులో భారత్ను రెండు ఇన్నింగ్స్లలోనూ యువ ప్లేయర్లు కాపాడారు. రెండో ఇన్నింగ్స్లో 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆరంభంలో అదరగొట్టినా.. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పారేసుకుంది. జైస్వాల్(37)తో మొదలైన పతనం.. ఆ తర్వాత రోహిత్ శర్మ(55), రజత్ పటిదార్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవీంద్ర జడేజా(4) ఒక్కొక్కరిగా వరుస ఇంటర్వెల్స్లో పెవిలియన్ చేరారు.
ఇలా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ను యువ ప్లేయర్లు శుభ్మాన్ గిల్(52 నాటౌట్), ధృవ్ జురెల్(39 నాటౌట్) కాపాడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. అనవసరమైన బంతులను వదిలేసి.. మంచి బంతులను బౌండరీలకు చేర్చి.. జట్టుకు విజయాన్ని అందించారు.
ఒక్క రెండో ఇన్నింగ్స్లో మాత్రమే కాదు.. తొలి ఇన్నింగ్స్లోనూ ధృవ్ జురెల్(90), యశస్వి జైస్వాల్(73) అర్ధ సెంచరీలతో ఆదుకోకపోయి ఉంటే.. ఇంగ్లాండ్కు మరింత లీడ్ వెళ్లేది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్(28)తో కలిసి ధృవ్ జురెల్ ఆడిన తీరు అమోఘమని మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపించారు.
అటు సరైన సమయానికి రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ రెండో ఇన్నింగ్స్లో స్పిన్తో మాయాజాలం చేశారు. ఇక ఈ విజయంతో డబ్ల్యూటీసీలో విన్నింగ్ పర్సెంటేజ్ను మరింత పెంచుకుంది టీమిండియా.