
బెస్ట్ బౌలింగ్: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా తన టెస్టు కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన జడేజా.. ఈ టెస్టులో 110 పరుగులిచ్చి పది వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకొన్నాడు.

రీఎంట్రీలో జడేజా చేసిన ఈ ప్రదర్శన ఎంతో ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే జడేజా గత 5 నెలలుగా మైదానానికి పూర్తిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో ఫుల్ స్వింగ్లో కనిపించిన జడేజా.. అటు బౌలింగ్లోనే కాదు, బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు.


నాగ్పూర్ టెస్టులో తన బౌలింగ్పై జడేజా మాట్లాడుతూ, 'నేను సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. బంతి బాగా తిరుగుతోంది. బంతి నేరుగా వెళుతోంది. తక్కువ ఎత్తులో ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు స్వీప్, రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు' అంటూ చెప్పుకొచ్చాడు. అర్ధ సెంచరీ ఇన్నింగ్స్పై జడేజా మాట్లాడుతూ, 'సాధారణంగా నేను విషయాలను చాలా సరళంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. పెద్దగా మారను. నా బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి సారిస్తున్నాను' అంటూ పేర్కొన్నాడు.

సెప్టెంబరులో కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న రవీంద్ర జడేజా 5 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు. చివరిసారిగా నాగ్పూర్ టెస్టుకు ముందు దుబాయ్లో జరిగిన ఆసియా కప్ 2022లో కనిపించాడు. ఆ తర్వాత ఆగస్ట్ 31న, హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో అతను గాయపడ్డాడు. ఆ తర్వాత అతను మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జడేజా గాయం కారణంగా సెప్టెంబర్లోనే కాలుకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ శస్త్రచికిత్స కారణంగా, అతను 2022 టీ20 ప్రపంచ కప్నకు కూడా దూరంగా ఉండవలసి వచ్చింది.