ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటయినా.. భారత్ విజయం సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన తర్వాత కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని నడిపించి భారత్కు విజయాన్ని అందించాడు. ఈక్రమంలో రాహుల్ సతీమణి అతియా శెట్టి తన భర్తను పొగుడూతో ఓ ప్రత్యేక సందేశం పంపింది.
నిజానికి ముంబై మ్యాచ్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్కు వచ్చేసరికి భారత్ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే రాహుల్ మాత్రం నిలకడగా ఆడాడు. మొదట హార్దిక్ పాండ్యాతో ఆ తరువాత రవీంద్ర జడేజాతో ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో రాహుల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్తో 75 పరుగులు చేశాడు.
కాగా చాలా కాలంగా పేలవమైన ఫామ్తో బాధపడుతున్న రాహుల్ని టెస్టు జట్టు నుంచి తప్పించారు. అదే సమయంలో వైస్ కెప్టెన్సీ కూడా అతడికి దూరమైంది. జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే వీటన్నింటికీ తన ఇన్నింగ్స్ తో సమాధానమిచ్చాడు రాహుల్.
ఈ సందర్భంగా రాహుల్ తన అర్ధ సెంచరీ తర్వాత జడేజాతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకొంటోన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న అతియా.. 'ప్రతి కష్టాన్ని ఎలా అధిగమించాలో, తిరిగి ఎలా బౌన్స్ అవ్వాలో నీకు బాగా తెలుసు. నాకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తివి నువ్వే' అని తన పోస్టకు క్యాప్షన్ ఇచ్చింది అతియా.
ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని ఈ ఏడాది కేఎల్ రాహుల్ వివాహం చేసుకున్నాడు. అతియా స్వయంగా బాలీవుడ్ నటి కూడా. చాలా కాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.