
ఆసియా కప్ 2023: ఆసియా కప్ టోర్నీని పాకిస్థాన్లో నిర్వహిస్తే భారత్ పాల్గొనబోదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్కి టీమిండియా రాకపోతే తాము భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడడోమని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. పాక్ నుంచి ఆసియా కప్ని తరలిస్తే, ఈ టోర్నీలో కూడా ఆడమని హెచ్చరించింది.

దాయాది దేశాల వాదనల నేపథ్యంలో సమస్యకు చెక్ పెట్టాలనుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్తో జరిగే మ్యాచ్లు మినహా అన్ని మ్యాచ్లను పాకిస్తాన్లో నిర్వహించాలని నిర్ణయించింది.

ఇక భారత్తో జరిగే మ్యాచ్లన్నీ యూఏఈలో జరపాలని..ఇలా చేస్తే ఆసియా కప్ నిర్వహణలో ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని ఏసీసీ యోచిస్తోంది. ఇక భారత జట్టు ఈ టోర్నీలోని తన మ్యాచ్లను పాకిస్థాన్ వెళ్లే అవసరం లేకుండా యూఏఈలో నిర్వహించనున్నారు.

అంటే టీమిండియాతో జరిగే మ్యాచ్ల కోసం మిగతా జట్లు యూఏఈకి చేరుకుంటాయి. ఇంకా భారత జట్టు ఫైనల్కు చేరితే ఫైనల్ మ్యాచ్ కూడా యూఏఈలోనే జరుగుతుంది.

అయితే 2023 ఆసియా కప్ ఆతిథ్య హక్కును నిలుపుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో 2 దేశాలలో ఆసియా కప్ నిర్వహించడంపై తదుపరి ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి.

కాగా, పాకిస్థాన్కు టీమిండియా వచ్చి ఆడకపోతే.. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్లో తాము కూడా ఆడబోమని పాక్ క్రికెట్ బోర్డు చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ సీరియస్గా తీసుకోవలేదు.

ఎందుకంటే ఐసీసీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగితే.. అది పాక్ జట్టు ఆదాయంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా 2 దేశాల్లో ఆసియా కప్ నిర్వహించే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుకూలంగా ఉండనుందని సమాచారం.