
పిల్లలకు జన్మనివ్వడం, మెటర్నిటీ లీవులు తీసుకోవడం, మళ్లీ ఉద్యోగంలోకి రావడం ఇవాళ్టి మహిళకు కొత్తేం కాదు. నేను కూడా అంతేనని అంటున్నారు ఇలియానా. తెలుగులో దేవదాసుతో పరిచయమైన నటి ఇలియానా. టాప్ హీరోలు అందరి సరసనా నటించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కొన్ని సినిమాలు చేశారు.

ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు ఇల్లీబేబీ. కొడుకుతో కొన్నాళ్లు గడిపిన ఆమె, ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇలియానా కీ రోల్ చేసిన దో ఔర్ దో ప్యార్ సినిమా మార్చి 29న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్లు కూడా మొదలవుతాయి. దో ఔర్ దో ప్యార్ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధి, ఇలియానా కీ రోల్స్ చేశారు.

పోస్ట్ ప్రెగ్నెన్సీ తాను డిప్రషెన్కి గురయినట్టు తెలిపారు ఇలియానా. తన బిడ్డకు ఏమైనా జరుగుతుందేమో, తాను తన బిడ్డ ఆలనాపాలనా చూసుకోగలనో లేదోననే ఆలోచనలు మితిమీరి వచ్చేవని అన్నారు. అలాంటి మానసిక స్థితిలో ఒత్తిడి విపరీతంగా ఉండేదని తెలిపారు. అయితే కుటుంబసభ్యులు, స్నేహితుల మద్దతుతో వాటి నుంచి బయటపడగలిగినట్టు తెలిపారు ఇలియానా. తానిప్పుడు షూటింగులకు వెళ్తుంటే ఆనందంగా ఉందని అన్నారు.

ఇలియానా మాత్రమే కాదు, ఆమెకు ముందు కూడా చాలా మంది పోస్ట్ డెలివరీ... స్క్రీన్ మీద కథానాయికలుగా సక్సెస్ అయ్యారు. ఇటీవల రాహాకు జన్మనిచ్చిన ఆలియా అంతే సక్సెస్ఫుల్గా కమ్బ్యాక్ అయ్యారు. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు ఆలియా. తాను గర్భిణిగా ఉన్న సమయంలోనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేశారు ఆలియా.

ఆ మధ్య తైమూర్కి జన్మనిచ్చిన కరీనాకపూర్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. సరోగసీ ద్వారా కవలపిల్లలకు తల్లయిన నయనతార కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు సినిమాల నిర్మాణంలో బిజీగా ఉన్నారు నయన్.

తెలుగులో అగ్రహీరోలందరితో జోడీ కట్టిన కాజల్ అగర్వాల్ కూడా రీఎంట్రీలో యాక్టివ్ అయ్యారు. భగవంత్ కేసరిలో బాలకృష్ణ సరసన నటించారు కాజల్ అగర్వాల్. మిగిలిన అన్నీ ఉద్యోగాల్లో పోస్ట్ డెలివరీ తల్లులు ఆఫీసులకు హాజరవుతారు. ఇప్పుడు యాక్టింగ్లోనూ అంతే జరుగుతోంది. జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో, అది అప్పుడు జరిగి తీరుతుందని, పిల్లలు పుట్టారని కెరీర్ని పక్కనపెట్టేయడం భావ్యం కాదు అని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు మేడమ్ ఆలియా.