ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్.. ఆ తర్వాత కొన్నేళ్ళు అలీ.. ఆ మధ్య కొన్నాళ్లు సునీల్.. ఈ ముగ్గురూ మినహాయిస్తే ఆ ప్లేస్ను రీప్లేస్ చేసిన వాళ్లే రాలేదు.
ఇన్నాళ్లకు మళ్లీ ఓ నటుడు ఆ స్థానంపై కన్నేసాడు. సగం ఉడికిన బిర్యాని మాదిరి.. ఈ సగం సగం చెప్పడాలేంటి..? ఆ ముగ్గురూ ఎవరు..? వాళ్లేం చేసారు..? ఆ స్థానంపై వేరే నటుడు ఎందుకు కన్నేసాడు అనుకుంటున్నారు కదా.!
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పట్నుంచో నడుస్తుంది. కాకపోతే అక్కడే జెండా పాతిన వాళ్లు మాత్రం తక్కువ. అందులో రాజేంద్ర ప్రసాద్ ఆల్ టైమ్ గ్రేట్. 20 ఏళ్ళ పాటు రాజేంద్రుడు తిరుగులేని కామెడీ హీరోగా చక్రం తిప్పారు.
ఆ తర్వాత అలీ కొన్నేళ్లు.. సునీల్ కొన్నాళ్లు ఆ మ్యాజిక్ చేసి చూపించారు. 80, 90 దశకాల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అగ్ర హీరోల సినిమాలతో సమానంగా వసూలు చేసాయి. యమలీల లాంటి సినిమాలతో అలీ హీరోగా మెప్పించారు.
అందాల రాముడుతో హీరోగా మారిన సునీల్.. మర్యాద రామన్న నుంచి హీరోగా మారిపోయారు. అర దశాబ్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారీయన. ఈ ప్లేస్పై ఇప్పుడు ప్రియదర్శి కన్నేసారు.
బలగంతో హీరోగా తొలి విజయం అందుకున్నారు ప్రియదర్శి. ఆ మధ్య డార్లింగ్ సినిమా ఫ్లాపైనా.. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో సారంగపాణి జాతకం సినిమాతో వస్తున్నారు.
డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే హిట్టు కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సారంగపాణి జాతకం హిట్టైతే మాత్రం ప్రియదర్శి మార్కెట్ మరింత పెరగడం ఖాయం.
ఓ వైపు కారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే.. మరోవైపు హీరోగానూ సినిమాలు సైన్ చేస్తున్నారు దర్శి. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తర్వాత ఆ రేంజ్ను ప్రియదర్శి సొంతం చేసుకుంటారా లేదా అనేది చూడాలిక.