
ఎన్నికల కారణంగా ఇప్పటి వరకు నష్టాలు వచ్చే సినిమాల గురించే మాట్లాడుకున్నాం కానీ పోలింగ్ మరో నెల రోజులు వెనక్కి వెళ్లడంతో లాభం వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా..! అసలే సినిమాల్లేక అల్లాడిపోతున్న ఆడియన్స్ ఆకలిని ఆ మూడు మూవీస్ తీర్చేస్తాయా..? ఈ డల్ పీరియడ్ను వాళ్లు వాడుకుంటారా..?

ఎంతసేపూ ఎన్నికల కారణంగా సమ్మర్ సీజన్ డల్ అయిపోయిందని చెప్పుకుంటున్నామే కానీ దీని వల్ల లాభపడే సినిమాలు కూడా మూడున్నాయి. మే13న పోలింగ్ కాబట్టి ముందు రెండు నెలలు పండగ చేసుకోవచ్చు.

ఈ లిస్టులో ముందున్న సినిమా ఓం భీమ్ బుష్. శ్రీ విష్ణు నటిస్తున్న ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. సామజవరగమనా తర్వాత వస్తుండటం దీనికి అడ్వాంటేజ్. సంక్రాంతి తర్వాత సరైన సినిమానే రాలేదు. అందుకే ఆకలి మీదున్నారు ఆడియన్స్. దాంతో ఓం భీమ్ బుష్ ఏ మాత్రం బాగున్నా.. కలెక్షన్లు కుమ్మేయడం ఖాయం.

డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో మార్చి 29న రాబోతున్నాడు. శ్రీ విష్ణు కంటే సిద్ధూ జొన్నలగడ్డ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఎక్కువే. పాజిటివ్ టాక్ వస్తే.. టిల్లు భాయ్ను పట్టుకునే వాళ్లే ఉండరు.

ఫ్యామిలీ స్టార్ కూడా ఈ లిస్టులోకే వస్తాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఎప్రిల్ 5న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం.. అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ పూర్తవ్వడం.. సమ్మర్ హాలీవుడ్ మొదలు.. ఇవన్నీ ఫ్యామిలీ స్టార్కు కలిసొచ్చే విషయాలు. మొత్తానికి ఈ మూడు సినిమాలకు ఈ సీజన్ కలిసొస్తే కాసుల పంట ఖాయం.