సీక్వెల్ మువీలు రావడం ఇప్పుడు ట్రెండ్ అయింది. ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ సూపర్ హిట్.. ఆ హిట్ కంటిన్యూ అవ్వాలంటే మూడో పార్ట్ రావాలి. కొన్ని మువీలను పుల్స్టాప్ పెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాటి కథలకు ఆ స్కోప్ ఉంది. వరుస పెట్టి ఎన్ని భాగాలైనా తీసేంత బలం ఆ కథలకు ఉంటుంది. అలా తెలుగులో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసించిన సినిమాల తొలి, మలి భాగాలు ఇప్పటికే వచ్చేశాయి. ఆ మువీల మూడో సీక్వెల్ కబుర్లు మీకోసం..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్ వచ్చిన ‘ఆర్య’ (2004) మువీ పెద్ద సక్సెస్ కొట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు కూడా. ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని సుకుమార్ స్పష్టం చేశారు.
ఇక బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన ‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద ఘన విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీని సీక్వెల్ ‘పుష్ప 2’ నిర్మాణ పనుల్లో ఉంది. ఆ తర్వాత ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట.
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ మువీ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. ఈ మువీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్గా వచ్చిన ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని చిత్ర బృందం హింట్ ఇచ్చి హైప్ క్రియేట్ చేసింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా మువీ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. 2018లో విడుదలైన ఈ మువీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మువీ చివర్లో పార్ట్ 2 ఉంటుందని ముందే చెప్పింది. ఆ తర్వాత యశ్ హీరోగా తెరకెక్కించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా లెక్కకు మించి వసూళ్లు రాబట్టింది. ఇక ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు.