
చావు కబురు చల్లగా అంటారు కదా.. ఇప్పుడు రాజమౌళి తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తుంటే.. వాళ్ళ కళ్లు బైర్లు గమ్మే వార్తతో వచ్చారు జక్కన్న. ఈయన చెప్పింది విన్నాక ఫ్యాన్స్కు కొత్త టెన్షన్ మొదలైందిప్పుడు.

అసలు SSMB 29 అప్డేట్ ఏంటి.. జక్కన్న ఏం చెప్పారు.? ట్రిపుల్ ఆర్ విడుదలై చూస్తుండగానే రెండేళ్లైపోయింది. ఇప్పటి వరకు నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టనే లేదు జక్కన్న. మహేష్ బాబుతో సినిమా అనే ముచ్చట తప్పిస్తే.. దానికి మించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.

పోనీలే.. ఇవాలో రేపో సినిమాను మొదలు పెడతారేమో అనుకుంటే.. అది కూడా అయ్యేలా కనిపించట్లేదిప్పుడు. రాజమౌళి చెప్పేదాన్ని బట్టి చూస్తే మహేష్ సినిమా మొదలవ్వడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. తాజాగా SSMB29 అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ప్రస్తుతం ఈయన జపాన్లో ఉన్నారు.

ట్రిపుల్ ఆర్ స్పెషల్ షోకు వెళ్లిన దర్శక ధీరుడు.. అక్కడే SSMB29 గురించి చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు రాజమౌళి. SSMB29లో వాళ్లు నటిస్తున్నారు.. వీళ్లు నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు జక్కన్న.

ఇందులో మహేష్ తప్ప క్యాస్టింగ్ ఎవరూ ఫైనల్ కాలేదని కుండ బద్ధలు కొట్టారు. చూస్తుంటే మహేష్, రాజమౌళి ఓపెనింగ్కి ఇంకా చాలా టైమ్ ఉంది. కాకపోతే ఇప్పటికే హైదరాబాద్లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో SSMB29 కోసం సెట్ వర్క్ జరుగుతుంది.

SSMB29పై చాలా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించనుండగా.. హృతిక్ రోషన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడిగా మహేష్ పాత్ర ఉండబోతుంది.

ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎక్కువగా పని చేయబోతున్నారు. ఉగాదికి పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది.