
పాన్ ఇండియా అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మిక మందన్నా. అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ అంటూ పిలుచుకునే ఈ అమ్మడు ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. చాలా కాలంగా విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న రష్మిక.. ఈ ఏడాది ఇరు కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక తెలుగింటి కోడలు.

మరోవైపు ఇటీవలే ఉత్తమ నటిగా గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకుంది రష్మిక. తాజాగా మరో అంతర్జాతీయ ఘనత సొంతం చేసుకున్నారు. జపాన్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో వరుసగా రెండోసారి ప్రెజంటర్ గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకుంది. గతంలో 2024లో ఈ వేదికపై మెరిసింది రష్మిక. ఇప్పుడు మరోసారి సందడి చేయనుంది.

రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రెటీగా రికార్డు క్రియేట్ చేసింది రష్మిక. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ పురస్కారాల 10వ ఎడిషన్ వేడుక మే 23న టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఆమె విజేతలకు అవార్డులను అందజేయనున్నారు.

పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రతో రష్మికకు జపాన్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇంటర్నేషనల్ లెవల్లో రష్మికకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యానిమల్, పుష్ప 2, కుబేర, గర్ల్ ఫ్రెండ్, థామా వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న ఆమె.. ప్రస్తుతం మైసా, రణబాలి చిత్రాల్లో నటిస్తున్నారు.

రణబాలి చిత్రంలో మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో రణబాలి చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. మైసా, రణబాలి సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.