
తాను తెరకెక్కించబోయే రామాయణం గురించి మాట్లాడారు డైరక్టర్ నితీష్ తివారి. వివాదాల లేని రామాయణం తీస్తానని అన్నారు. తనకు రామాయణం మీద సంపూర్ణ అవగాహన ఉందని, నటీనటుల గురించి త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. నితీష్ తివారి రామాయణంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతమ్మగా ఆలియా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ది కేరళ స్టోరీకి సంబంధించి కమల్హాసన్ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు నటి అదా శర్మ. విమర్శించిన వారు ఆ సినిమాను చూసి ఉండరని అన్నారు. మన దేశంలో ఉన్న వాక్ స్వతంత్రాన్ని తలచుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎవరు ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. ఎవరి దృష్టికోణం వారిది. దాన్ని గౌరవిస్తున్నాను. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నారు అదా శర్మ.

రాజ్ డీకే తనకోసం ఇంకో మంచి పాత్ర రాసేవరకూ ఇప్పటిదాకా చేసిన సిటాడెల్ కేరక్టర్ తన కెరీర్లో బెస్ట్ అని అన్నారు సమంత. దీన్ని బట్టి ఆమె సినిమాల్లో టెంపరరీ బ్రేక్ మాత్రమే తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. తనకు అన్ని వేళలా రాజ్, డీకే మద్దతిచ్చారని సమంత తెలిపారు. ఫ్యామిలీమేన్ థర్డ్ చాప్టర్ ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే సమంత ఎప్పుడు జాయిన్ అవుతారన్నదాని మీద క్లారిటీ లేదు.

రామ్, చరణ్ ఉపాసన తనయ క్లీంకారా కొణిదెల రూమ్ డెకరేషన్కి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. తమ కుమార్తెకు ఇంట్లో ఫారెస్ట్ బేస్డ్ థీమ్ని ఏర్పాటు చేసిన విషయాన్ని చెబుతూ స్నీక్ పీక్ విడుదల చేశారు. చూడ్డానికి సౌందర్యాత్మకంగా, మైల్డ్ కలర్స్ తో మెప్పిస్తోంది థీమ్. జంతువుల పెయింటింగ్స్ తో, బొమ్మలతో ఏర్పాటు చేశారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ ఫస్ట్ ఫీమేల్ లీడ్ స్పై ఫిల్మ్ అనౌన్స్ చేసింది. ఇందులో ఆలియాభట్ హీరోయిన్ గా నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. 2012 నుంచి స్పై మూవీలను తెరకెక్కిస్తోంది యష్రాజ్ ఫిల్మ్స్. ఇప్పటిదాకా ఆలియా చేయని తరహా పాత్రను డిజైన్ చేస్తున్నారు ఆదిత్య చోప్రా. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది ఈ మూవీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.