
సినిమా పబ్లిసిటీ ఫలానా విధంగానే చేయాలనే రూల్సు ఏవీ లేవిప్పుడు. బార్డర్ క్రాస్ చేసి, గ్రౌండ్ని బ్రేక్ చేసి, రూట్స్ ని టచ్ చేసి.... ఏం చేసినా, నెవర్ బిఫోర్ అనిపించేలా చేసిన వాళ్లదే సక్సెస్. ఆడియన్స్ ని థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్సయిపోతే ప్రతిదీ పబ్లిసిటీ మెటీరియల్గానే కనిపిస్తుంది.

ఆపరేషన్ వేలంటైన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు హీరో వరుణ్తేజ్. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆయన ఆల్రెడీ వాఘా బార్డర్కి వెళ్లొచ్చారు. లేటెస్ట్ గా పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించారు.

14 ఫిబ్రవరి 2019న జరిగిన పుల్వామా ఘటనలో 40 మంది భారతీయ సీఆర్పీఎఫ్ సిబ్బంది కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ ప్రదేశాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు వరుణ్. అప్పుడు జరిగిన ఘటన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

మేజర్ సినిమా సమయంలో అడివి శేష్ కూడా ఇలాగే ప్రచారం చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాలకు సైతం వాళ్లను ఆహ్వానించి, ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పటికీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను కలుస్తుంటారు శేష్.

నార్త్ లో సూపర్డూపర్ హిట్ అయిన సినిమా షేర్షా. కెప్టెన్ విక్రమ్ బాత్రా కథతో తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లిదండ్రులను కలుసుకున్నారు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ టీమ్. ఇప్పటికీ విక్రమ్ బాత్రా కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే ఉంటామని అంటారు నాయిక కియారా అద్వానీ.