
దర్శకులే నిర్మాతలు.. నిర్మాతలే దర్శకులు.. టాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉన్న ట్రెండ్ ఇది. అగ్ర దర్శకులంతా ఇదే ఫాలో అవుతున్నారు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులైతే.. నిర్మాతలుగా చాలా బిజీ అయిపోయారు. సుకుమార్ రైటింగ్స్, త్రివిక్రమ్ ప్రొడక్షన్లో దాదాపు మూడు నాలుగు సినిమాలు సెట్స్పై ఉన్నాయిప్పుడు.

ఫార్చున్ ఫోర్ సంస్థలో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా వరస సినిమాలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి NBK 109, లక్కీ భాస్కర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ మధ్యే టిల్లు స్క్వేర్ సైతం ఇదే సంస్థలో వచ్చింది.

ఇక సుకుమార్ రైటింగ్స్ నుంచి పుష్ప 2, RC16 రాబోతున్నాయి. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎప్పట్నుంచో నిర్మాతగా బిజీగా ఉన్నారు. తాజాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఈయన నిర్మాణంలోనే వస్తుంది.

కొరటాల శివ సైతం ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. ఈయన సమర్పణలో కృష్ణమ్మ అనే సినిమా వస్తుంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపాలకృష్ణ దర్శకుడు. మే 3న విడుదల కానుంది కృష్ణమ్మ.

హరీష్ శంకర్ సైతం ప్రొడక్షన్లోకి వచ్చారు. వెబ్ సిరీస్లతో పాటు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్. అనిల్ రావిపూడి ఆ మధ్య గాలి సంపత్ నిర్మాణంలో భాగం అయ్యారు. బ్రహ్మస్త్ర తెలుగు వర్షన్కు సమర్పకుడిగా ఉన్నారు రాజమౌళి. ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు సందీప్ వంగా దర్శకుడే కాదు నిర్మాత కూడా. మొత్తానికి డైరెక్టర్స్ అంతా నిర్మాతలుగానూ బిజీగా ఉన్నారిప్పుడు.